Bhogi 2024: భోగి రోజున భోగిపళ్ళుగా మారే రేగిపళ్ళు.. ఎందుకు పోస్తారు.. శాస్త్రీయ కోణం ఏమిటంటే..

|

Jan 13, 2024 | 5:36 PM

ఎవరి ఇంట్లోనైనా ఐదేళ్ల లోపు చిన్న పిల్లలు ఉంటే వారి ఇంట్లో భోగి రోజు సాయంత్రం సందడే సందడి. ఇంటి ఇరుగు పొరుగువారికి స్నేహితులను పిలిచి చిన్న పిల్లలకు భోగి పళ్లను పోస్తారు. ఈ సమయంలో చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడినిగా భావిస్తారు. ఎందుకంటే రేగిపళ్ళను సంస్కృతంలో బదరీఫలం అంటారు. బదరీశుడు అంటే శ్రీ మహా విష్ణువు. రేగి పళ్లలో చామంతి, బంతి పువ్వు రేకులతోపాటు, చిల్లర నాణేలు కలిపి భోగి పళ్లు సిద్ధం చేస్తారు. తర్వాత వీటిని చిన్నారుల తల చుట్టూ మూడు సార్లు తిప్పి దిష్టి తీసి తలపై పోసి.. అక్షతలతో దీవిస్తారు.   

Bhogi 2024: భోగి రోజున భోగిపళ్ళుగా మారే రేగిపళ్ళు.. ఎందుకు పోస్తారు.. శాస్త్రీయ కోణం ఏమిటంటే..
Bhogi Pallu On Bhogi Day
Follow us on

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి మొదలైంది. మూడు రోజుల పాటు ప్రతి ఇంట సంబరాలు అంబరాన్ని తాకుతాయి. మొదటి రోజు జరుపుకునే భోగి పండగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది భోగి మంటలు, భోగి పళ్లు. చిన్న పిల్లలకు పేరంటం చేసి.. నెత్తి మీద రేగుపళ్లను పోస్తారు. ఈ రేగుపళ్లు  భోగి రోజున భోగిపళ్లుగా మారిపోతాయి. అయితే చిన్న పిల్లలకు భోగి రోజున రేగుపళ్లని పోయడంలో అంతరార్ధం ఏమిటి? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రీజన్ శాస్త్రీయ కోణం ఏమిటి ఈ రోజు తెలుసుకుందాం..

ఎవరి ఇంట్లోనైనా ఐదేళ్ల లోపు చిన్న పిల్లలు ఉంటే వారి ఇంట్లో భోగి రోజు సాయంత్రం సందడే సందడి. ఇంటి ఇరుగు పొరుగువారికి స్నేహితులను పిలిచి చిన్న పిల్లలకు భోగి పళ్లను పోస్తారు. ఈ సమయంలో చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడినిగా భావిస్తారు. ఎందుకంటే రేగిపళ్ళను సంస్కృతంలో బదరీఫలం అంటారు. బదరీశుడు అంటే శ్రీ మహా విష్ణువు. రేగి పళ్లలో చామంతి, బంతి పువ్వు రేకులతోపాటు, చిల్లర నాణేలు కలిపి భోగి పళ్లు సిద్ధం చేస్తారు. తర్వాత వీటిని చిన్నారుల తల చుట్టూ మూడు సార్లు తిప్పి దిష్టి తీసి తలపై పోసి.. అక్షతలతో దీవిస్తారు.

ఇలా చేయడం వలన తమ పిల్లలపై విష్ణువు అనుగ్రహం ఉంటుందని విశ్వాసం.  అంతేకాదు తలపై భాగంలో  బ్రహ్మరంధ్రం ఉంటుందట.. ఇలా భోగి పండ్లను పోస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారని పెద్దల విశ్వాసం.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యాన్నిచ్చే భోగి పళ్లు

సంక్రాంతి నాటికి అందుబాటులోకి వచ్చే ఈ రేగు పళ్లు రుచికి పుల్లపుల్లగా ఉంటాయి. అంతేకాదు సకల ఆరోగ్యాలనూ అందించే ఔషధి గుణాలతో నిండి ఉంటాయి. ఈ భోగి పళ్లను ఐదేళ్లలోపు పిల్లలకి పోస్తారు. ఈ సమయంలో పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ చాలా బలహీనంగా ఉంటాయి. కనుక ఈ వయసు పిల్లలకు రేగుపళ్లు ఒక ఔషధం అని విశ్వాసం. వీటిలో ‘సి’విటమిన్‌ చాలా ఎక్కువ. కనుక రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాదు జీర్ణసంబంధమైన వ్యాధులతో పాటు ఉదరసంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కూడా ఇస్తాయట.

ఇక బంతిపూల రెక్కలు క్రిమి సంహారిణి. బంతి పువ్వులు చర్మ సంరక్షణ గుణం కలిగి ఉన్నాయి. ఎటువంటి  చర్మసంబంధమైన వ్యాధినుంచైనా ఉపశమనం కలిగించే గుణం ఈ పువ్వుల సొంతం. కనుక మన పెద్దలు చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇలా భోగి పళ్లు పొసే సాంప్రదాయం పెట్టి ఉండవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు