మాటల మాంత్రికుడా.. మౌనమెందుకు?

ఆయన ఓ ఫైర్‌బ్రాండ్‌. పార్టీ తరపున వాయిస్‌ వినిపించడంలో దిట్ట. అంకెలు, సామెతలతో ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. ఢిల్లీ నుంచి లైవ్‌లోకి వచ్చారంటే ఆ రోజు ఎవరికి మూడిందో అని అర్ధం. కానీ ఈమధ్య ఆయన గొంతు మూగబోయింది. అమరావతి వైపు కనీసం కన్నెత్తి చూడడంలేదు. ఎస్.. ఆయనే జీవీఎల్ నరసింహారావు. ఇంతకూ జీవీఎల్‌కు ఏమైంది ? ఫైర్ బ్రాండ్‌. మొన్నటి దాకా ఏపీ రాజకీయాలపై ఈయన ఘాటైన వ్యాఖ్యలు చేసేవారు. తమ ప్రత్యర్థి పార్టీకి చురకల […]

మాటల మాంత్రికుడా.. మౌనమెందుకు?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 7:56 PM

ఆయన ఓ ఫైర్‌బ్రాండ్‌. పార్టీ తరపున వాయిస్‌ వినిపించడంలో దిట్ట. అంకెలు, సామెతలతో ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. ఢిల్లీ నుంచి లైవ్‌లోకి వచ్చారంటే ఆ రోజు ఎవరికి మూడిందో అని అర్ధం. కానీ ఈమధ్య ఆయన గొంతు మూగబోయింది. అమరావతి వైపు కనీసం కన్నెత్తి చూడడంలేదు. ఎస్.. ఆయనే జీవీఎల్ నరసింహారావు. ఇంతకూ జీవీఎల్‌కు ఏమైంది ?

ఫైర్ బ్రాండ్‌. మొన్నటి దాకా ఏపీ రాజకీయాలపై ఈయన ఘాటైన వ్యాఖ్యలు చేసేవారు. తమ ప్రత్యర్థి పార్టీకి చురకల మీద చురకలు వేసేవారు. పార్టీ తరపున గట్టి వాయిస్‌ వినిపించేవారు. జీవీఎల్ ప్రెస్‌మీట్‌ పెడితే ప్రత్యర్థి పార్టీలపై పంచ్‌ల వర్షం కురిసేది. పార్టీ తరపున టీవీ డిబేట్లలో కూడా గట్టిగా మాట్లాడేవారు. కానీ ఈ మధ్య జీవీఎల్‌ సైలెంట్‌ అయ్యారు.

ఏపీ రాజకీయాలపై ఆయన కామెంట్ చేయడం లేదు. కనీసం ఒక్క ప్రెస్‌మీట్‌ కూడా పెట్టడం లేదు. టీవీ డిబేట్లు కూడా రావడం లేదు. జీవీఎల్‌ ఎందుకు మౌనం వహించారు. వ్యూహాత్మక మౌనమా? లేక పార్టీ ఆదేశాలతో ఆయన సైలెంట్‌ అయిపోయారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

జీవీఎల్‌ సైలెంట్‌ కావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీలో రాబోయే రోజుల్లో చాలా మార్పులు జరగబోతున్నాయట. కొత్త నాయకత్వం వస్తుందనే ప్రచారం నడుస్తోంది. ఇటు ఇసుక కొరత, ఇంగ్లీష్‌ మీడియంతో పాటు చాలా అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ అంశాలపై పార్టీలో క్లియర్‌ స్టాండ్‌ లేదు.

ఒక వేళ మీడియా ముందుకు వస్తే జీవీఎల్‌ ఈ అంశాలపై పార్టీ స్టాండ్‌ వివరించాల్సి ఉంటుంది. అందుకే ఆయన సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. వైసీపీ సర్కార్‌పై బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాం ఖరారు అయిన తర్వాత జీవీఎల్‌ బయటకు వచ్చే అవకాశం కన్పిస్తోంది.

మరోవైపు ఏపీలో బీజేపీ, జనసేన కలుస్తాయని ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా కూడా చాలా పరిణామాలు జరుగుతున్నాయి. టీడీపీ, జనసేన విషయంలో క్లియర్‌ పిక్చర్‌ రావాల్సి ఉంది. ఈ అంశాల్లో క్లారిటీ లేకనే జీవీఎల్‌ మౌనం వహించినట్లు తెలుస్తోంది. హైకమాండ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన తర్వాత మళ్లీ జీవీఎల్‌ యాక్టివ్‌ అవుతారని ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం.