ఎప్పుడైనా వారు వైసీపీలోకి రావొచ్చు.. టీడీపీ ఎమ్మెల్యేలపై కరణం వ్యాఖ్యలు
నియోజకవర్గాల అభివృద్ది కోసం వైసీపీలో చేరేందుకు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అన్నారు.
నియోజకవర్గాల అభివృద్ది కోసం వైసీపీలో చేరేందుకు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అన్నారు. 10 మంది వస్తారా లేక 12 మంది వస్తారా అన్న సంఖ్య ఇప్పుడే చెప్పలేమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు సీఎం జగన్, ఇతర ముఖ్య నేతలతో టీడీపీకి సంబంధించిన చాలా మంది టచ్లో ఉన్నారని ఆయన తెలిపారు. ప్రకాశంజిల్లా నుంచి కూడా పలువురు వైసీపీలోకి వస్తున్నారన్న సమాచారం ఉందని.. దీనికి కొంతసమయం పట్టొచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన విమర్శలు చేశారు. బాబుతో తాము ఎంతకాలం నుంచి ఉన్నామో అందరికీ తెలుసని.. ఎంత ఇబ్బంది పడ్డామో కూడా తెలుసని కరణం వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు ఆ విషయాలు మాట్లాడతానని ఆయన తెలిపారు. చంద్రబాబు పోకడకి, జగన్ వ్యవహార శైలికి చాలా తేడా ఉందని.. నమ్ముకున్న వాళ్లకి జగన్ న్యాయం చేస్తారని ప్రశంసించారు. వైఎస్ఆర్తో కూడా తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో టీడీపీ హయాంలో ఎంతో వత్తిడి తెచ్చామని.. ప్రాజెక్టు పూర్తి చేయలేదంటే అది తమ ఆసమర్ధత కాదని, బాబు నిర్లక్ష్యమేనని ఆయన అన్నారు. ఇప్పుడైనా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలన్నదే తన కోరిక అని కరణం వివరించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా వస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పి మమ్మల్ని రమ్మనలేదని.. జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో నియోజకవర్గాల అభివృద్ది కోసమే టీడీపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారని కరణం అన్నారు.
Read This Story Also: క్రిమినల్ కేసులు పెడతాం.. సూర్య తండ్రి వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్