Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Rain Alert For AP: తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్న విషయం తెలిసిందే. అల్పపీడనం ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Updated on: Sep 08, 2023 | 12:50 PM

Rain Alert For AP: తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్న విషయం తెలిసిందే. అల్పపీడనం ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, నదుల్లో నీటి ప్రవాహం కూడా పెరిగింది. ఈ క్రమంలో కొంచెం గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలు కాబోతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఛత్తీస్గడ్కు ఆనుకుని మధ్య ఒడిశా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది.

ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాంధ్రా జిల్లాల్లో చాలా చోట్ల చెదురుమదురు వానలుతో పాటు ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. రాయలసీమలో అక్కడక్కడా జల్లులు పడతాయని పేర్కొంది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతోపాటు.. తీరం వెంబడి గంటలకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడుతుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో వాతావరణ అధికారులు మత్స్యకారులకు అలర్ట్ జారీ చేశారు. మరో మరో రెండ్రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకరాలకు వాతావరణ అధికారులు హెచ్చరించారు.

ఇదిలాఉంటే.. తెలంగాణలో కూడా మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే.. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అంతేకాకుండా పలు నదులు భారీగా ప్రవహిస్తున్నాయి.





























