
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దమైంది. పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు మొత్తం పూర్తి చేశారు. ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డులకు గాను 8వేల 203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 12,993 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 52 లక్షల మందిపైగా ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు.

ఓటర్ కార్డు తప్పని సరేం కాదు: అయితే ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లు ఓటేసేందుకు కచ్చితంగా ఓటర్ కార్డు అవసరమని అనుకుంటారు. కానీ ఓటర్ కార్డు సహా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదించిన 12 ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలలో ఏ ఓక్క గుర్తింపు కార్డు మీ దగ్గర ఉన్నా.. దాన్ని చూపించి మీరు ఒటు హక్కును వినియోగించుకోవచ్చు. కాబట్టి కచ్చితంగా మీరు ఓటర్ ఐడీ కార్డునే తీసుకెళ్లడం తప్పనిసిరి ఏం కాదని అధికారులు చెబుతున్నారు.

వీటిలో ఏ కార్డు ఉన్నా ఓటు వేయవచ్చు: ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓటు వేసే వ్యక్తి మీ ఫోటోతో కూడిన గుర్తింపు కార్డును చూపించి పోలింగ్ కేంద్రంలో తమ గుర్తింపును నిర్ధారించుకోవాలని అన్నారు. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ఈసీ నోటిఫైడ్ చేసిన 12 పత్రాలలో దేనినైనా సమర్పించవచ్చన్నారు.

ఆ గుర్తింపు కార్డులు ఏవనే విషయానికి వస్తే పాస్పోర్ట్, ఆధార్ కార్డు , డ్రైవింగ్ లైసెన్స్ , పాన్ కార్డ్ , ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డులు , ఫోటోలతో కూడిన బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్బుక్లు , ఫోటోలతో కూడిన వైకల్య ధృవీకరణ పత్రాలు , MGNREGA జాబ్ కార్డులు , పెన్షన్ సంబంధిత ఫోటో పత్రాలు , ఎంపీలు, ఎమ్మెల్యేలకు జారీ చేయబడిన అధికారిక గుర్తింపు కార్డులు, స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డులు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఫోటో ఆరోగ్య బీమా కార్డులు ఇలా ఏవి ఉన్నా మీరు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

అయితే బుధవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల పరిధిలోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కాబట్టి అర్హులైన ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుంది కాబట్టి దూర ప్రాంతాల ప్రజలు త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.