Pidakala War: ఆ గ్రామంలో నేడే పిడకల సమరం.. త్రేతాయుగం నుంచి ప్రేమికుల కోసం కొనసాగుతున్న సాంప్రదయం వెనుక కథ ఏమిటంటే..
త్రేతాయుగంలో కాళికా మాత (భద్రకాళిక అమ్మ వారు ) వీరభద్ర స్వామి వార్ల మధ్య జరిగిన ప్రేమ పెళ్లి వ్యవహార గొడవను ఇప్పటికి ఆ గ్రామస్థులు కొనసాగిస్తున్నరు. వారి ఇరువురూ మీద ఉన్న భక్తితో ఇరువర్గాల వారు ఉగాది పర్వదినం వెళ్ళిన మర్నాడు ఆవు పేడతో తయారు చేసిన ఎండిన పిడికలతో ఒక్కసారిగా దాడులు చేసుకొంటారు. గాయాలు కావడం తప్పని సరి అయిన ఒకరిపై మరొకరు భక్తితో ఈ సమరంలో ముందుకు సాగుతున్నారు. ఆ భక్తి గొడవ ను చూడాలంటే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామానికి చేరుకోవలసిందే ఎవరైనా..
J Y Nagi Reddy | Edited By: Surya Kala
Updated on: Apr 10, 2024 | 8:37 AM

కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రజలు కొన్ని తరతరాలుగా ఆచారాలను, సంప్రదాయలను, భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. అలాకొన్ని సంప్రదాయం క్రీడల్లో ఒకటి ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో జరిగే పిడకల సమరం. శ్రీ భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది.

త్రేతాయుగంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఇద్దరు ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతోంది. వారి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త గొడవకు దారితీస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకోకుండా భద్రకాళి దేవిని వీరభద్ర స్వామి మోసం చేసారని అమ్మ వారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరభద్ర స్వామిని ఆవు పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు. దీనిని తెలుసుకొన్న వీరభద్ర స్వామి భక్తులు అమ్మ వారు నివాసం ఉండే వీధి లోనికి వీరభద్ర స్వామి ని వెళ్లవద్దని వేడుకొంటారు.

స్వామి భక్తులు చెప్పిన మాటలు పక్కకు నెట్టి అమ్మవారు ఉన్న వీధి లోనికి వీరభద్ర స్వామి వెళుతారు. అప్పుడు అమ్మవారి భక్తులు ముందు గా వేసుకోన్న ప్రణాళికతో వీరభద్ర స్వామి పై ఆవు పేడతో తయారు చేసిన పిడకలతో వేస్తారు. విషయం తెలుసుకున్న స్వామి వారి భక్తులు కూడా పిడకలతో అక్కడికి వెళుతారు. అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగుతారు. ఇరువర్గాల మధ్య పిడకల సమరం తీవ్ర స్థాయిలో సాగుతోంది.

బ్రహ్మదేవునికి వారి మధ్య జరుగుతున్న పిడకల సమరం విషయం విశ్వకర్మ (భద్రకాళి అమ్మ వారి) తండ్రి చెబుతారు. బ్రహ్మ దేవుడు వీరభద్ర స్వామి తండ్రి శివుడు దృష్టికి తీసుకుని వెళుతారు. అప్పుడు బ్రహ్మ దేవుడు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేస్తారు. భద్రకాళిక అమ్మ వారికి, వీరభద్ర స్వామి వారికి పెళ్లి చేసే భాద్యత తనదని బ్రహ్మదేవుడు ఇరువర్గాల భక్తులకు మాట ఇస్తారు.

పిడకల సమరం ముగిసిన తర్వాత బ్రహ్మదేవుడు భద్రకాళిక దేవుకి వీరభద్ర స్వామి వార్లకు కల్యాణం జరిపిస్తారు. ఇద్దరి విగ్రహాలను ఒకే ఆలయంలో ఉంచి పూజలు చేసుకోవాలని భక్తులకు బ్రహ్మ సూచిస్తారు

స్వామి వార్ల పిడకల సమరానికి ముందు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం కైరుప్పల గ్రామం పక్కన ఉన్న కారుమంచి గ్రామ రెడ్డి వంశీయుల తో భద్రకాళిక అమ్మ వారికి వీరభద్ర స్వామి వార్లకు మొదటి పూజ చేసి అవకాశం కల్పించారు. త్రేతాయుగం నుంచి రెడ్డి వంశీయుల ప్రత్యేకంగా కారుమంచి గ్రామం నుంచి తమ అనుచరులతో గుర్రంపై ఊరేగింపుగా వచ్చి స్వామి పూజలు నిర్వహించడం ఇప్పటికీ విశేషం.

పిడకల సమరంలో గాయపడ్డ ఇరువర్గాల భక్తులు వీరభద్ర స్వామి, భద్రకాళిక అమ్మవార్లకు నమస్కారం చేసుకొని ఆలయంలో ఉన్న విభూతిని రాసుకొని వెళ్తారు. ఆ విభూతి తో గాయాలు నయం అవుతాయని వారి నమ్మకం. ఇప్పటికి భక్తులు అదే ఆచారాన్ని కొనసాగించడం ప్రత్యేకత



















