- Telugu News Photo Gallery Spiritual photos Konaseema: Sri Venkateswara Swamy 12th Annual Brahmotsavam Celebrations In Vadapally
Konaseema: వైభవంగా వాడపల్లి బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వాహన సేవలు.. భారీ సంఖ్యలో భక్తులు హాజరు
కోనసీమ తిరుమల వాడపల్లి బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. శ్రీవేంకటేశ్వరస్వామి 12 వ వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 21 నుంచి 29వ తేదీ ఈరోజు చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి. తిరుమల తరహాలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు.. యాగశాలలో ప్రత్యేక హోమాలతో పాటు, వసంత మండపంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
Updated on: Oct 29, 2024 | 12:09 PM

వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం బ్రహ్మ త్వంలో వేద పండితులు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి... స్వామివారి ఆలయాన్ని ఫల, పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. మొదటి రోజు స్వామివారికి తిరుమంజన సేవ, అకల్మష హోమం, నవమూర్తి అవాహన, ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. తొలిరోజు పరావాసుదేవ అలంకరణతో శ్రీవారు శేష వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. బొబ్బర్లంక నుంచి రావులపాలెం వరకు ఎల్ఈడీ విద్యుత్ దీపాలంకరణలతో కూడిన భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. స్వామివారి ఆలయాన్ని ఫల, పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.

తోమాల సేవ, మహా సుదర్శన హోమం. యోగనారసింహ అలంకరణతో సింహ వాహన సేవ, కేరళ వాయిద్యం, గిరిజన సంప్రదాయ వాయిద్యం, దాండియా కోలాటం, అష్టదళపాదపద్మారాధన, మలయప్ప అలంకరణతో గరుడవాహన సేవను నిర్వహించారు, కేరళ వాయిద్యం, కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తొమ్మిది రోజులు పాటు ఉదయాన్నే సుప్రభాత సేవ, అష్టోత్తర శత కలశాభిషేకం, శ్రీకృష్ణ అలంకరణతో సూర్యప్రభ వాహనంలో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

లక్ష్మీవేంకటేశ్వర హోమం, మోహినీ అలంకరణతో చంద్రప్రభ వాహనసేవ, తెలంగాణ బోనాల కోలాటం, అన్నమయ్య సంకీర్తనలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. తిరుప్పావడ సేవ, రాజాధిరాజ అలంకరణతో శ్రీవారికి గజ వాహన సేవతో పాటు వివిధ వాయిద్యాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఏడువారాల ఏడు ప్రదక్షణల వెంకటేశ్వర స్వామిగా భక్తులకు రోజు దర్శనమిస్తున్నారు వెంకటేశ్వర స్వామి...గోదావరి నదీ జల సంగ్రహణం, లక్ష కుంకుమార్చన, మహాలక్ష్మి హోమం, చూర్ణోత్సవం, కల్కి అలంకరణతో అశ్వ వాహన సేవ. కేరళ వాయిద్యాలు, డోలు సన్నాయితో పాటు మహారాష్ట్ర వాయిద్య కళాకారులతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు

తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత చందన స్వరూపుడైన శ్రీవేంకటేశ్వరస్వామి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి అన్నారు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. విద్యుత్ దీపాలంకరణ, సుంగధ పరిమళాలు వెదజల్లే వేద పండితుల మంత్రోచ్ఛరణ, కళాకారుల ప్రదర్శనలు, భక్తజన గోవిందనామస్మరణల నడుమ వాడపల్లి పులకించిందన్నారు.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు ఎమ్మెల్యే .. పర్యటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ కూడా ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆధ్యాత్మిక బస్సులను కూడా ఏర్పాటు చేశారన్నారు ఎమ్మెల్యే బండారు.

ఆగమ శాస్త్ర ప్రకారం ఖండవిల్లి రాజేశ్వరవరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేదపండితులు, అర్చక బృందం, బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా చూర్ణోత్సవాన్ని విభూది జల్లుకుంటూ ఘనంగా నిర్వహించారు.

స్వస్తివచనము, విశ్వక్సేనపూజ, పుణ్యహవచనము, దీక్షాధారణ, కల్మసహోమము, అగ్ని ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలను రమణీయంగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాల తో అలంకరించిన వసంత మండపంలో స్వామివారు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలను అందుకున్నాడు వెంకటేశ్వర స్వామి.

చివరి ఘట్టమైన చూర్ణోత్సవ వేడుకలు విభూదిని చల్లుకుంటూ భక్తులు పురోహితులు ఆలయ సిబ్బంది నృత్యాలు చేసుకుంటూ ఆనందోత్సవాల మధ్య చూర్ణోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు 29 తేదీ అంటే ఈరోజు మహా పూర్ణాహుతి, చక్రస్నాన మహోత్సవం, మహదాశీర్వచనం, ఏకాంత సేవ, మహారాష్ట్ర వాయిద్య కళాకారులు, కేరళ వాయిద్యం, డోలు సన్నాయిలతో కల్యాణోత్సవాలు ముగుస్తాయి.




