Brain: షాకింగ్ న్యూస్.. మనిషి మెదడులో ప్లాస్టిక్ గుర్తించిన పరిశోధకులు
ప్లాస్టిక్.. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న ప్లాస్టిక్ వాడకం కారణంగా వాతావరణం కాలుష్యమవుతోన్న విషయం తెలిసిందే. అయితే కేవలం వాతావరణమే కాకుండా మనిషి ఆరోగ్యాన్ని కూడా ప్లాస్టిక్ పాడుచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా పరిశోధకులు ఇందుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు..
Updated on: Aug 24, 2024 | 2:33 PM

మనిషి శరీరంలో ప్లాస్టిక్ అవశేషాలు బయటపడడం అందరినీ షాక్కి గురి చేస్తోంది. మనిషి ఊపిరితిత్లతులతో పాటు ఇతర శరీర భాగాల్లో ప్లాస్టిక్ పేరుకుపోతున్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా మానవ శరీరంలో కూడా ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. ఈ ఏడాది ప్రారంభంలో శవపరీక్షల్లో సేకరించిన మానవ మెదడులో, ఎనిమిదేళ్ల క్రితం సేకరించిన నమూనాల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉన్నట్లు తేలింది. ఈ లెక్కన కాలక్రమేణ మానవ శరీరంలో ప్లాస్టిక్ అవశేషాలు పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

పరిశోధకులు ఇందులో భాగంగా 91 మెదడు నమూనాలను పరిశీలించారు. ఇతర అవయవాలతో పోల్చితే మెదడులోనే ఎక్కువగా మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు న్యూ మెక్సికో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మాథ్యూ కాంపెన్ తెలిపారు.

24 మెదడు నమూనాల్లో అయితే మొత్తం బరువులో 0.5 శాతం వరకు ప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించారు. ఇది తీవ్ర ఆందోళనకు గురి చేస్తింది. ముఖ్యంగా డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలు ఉన్నవారి మెదళ్లలో ప్లాస్టిక్ ఎక్కువ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

మనం తీసుకునే ఆహారం, నీటితో నానోప్లాస్టిక్ శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. గాలిలో ఉండే మైక్రోప్లాస్టిక్ కణాలు సైతం శరీరంలోకి వెళ్తున్నాయని అంటున్నారు. కాబట్టి మన చేతిలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్లో నీరు తాగడం, ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించడం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.





























