Odisha Train Accident Photos: పట్టాలపై మరణమృదంగం.. దుర్ఘటనతో ఉలిక్కిపడ్డ యావత్ దేశం.
ఒడిశా రైలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రమాదంలో భీతావహ దృశ్యాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సహాయకచర్యలను పర్యవేక్షించారు.
Updated on: Jun 03, 2023 | 11:35 AM

ఒడిశా రైలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రమాదంలో భీతావహ దృశ్యాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సహాయకచర్యలను పర్యవేక్షించారు.

రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామన్నారు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్. ప్రస్తుతం సహాయక చర్యలపైనే దృష్టి సారించామన్నారు. బాధితులను ఆదుకోవడమే తమ తొలి లక్ష్యమన్నారు. రైల్వే సేఫ్టీ అథారిటీ కూడా ఘటనపై విచారణ చేపట్టినట్లు చెప్పారు. ప్రమాదంలో నిర్లక్ష్యం ఉందా, లేదా అనేది విచారణలో తేలుతుందన్నారు. విచారణ నివేదిక వచ్చాకే పూర్తివివరాలు చెబుతానన్నారు.

ఒడిశా రైలు ప్రమాద ప్రాంతం భయానకంగా మారింది. ఎటు చూసినా బాధుతుల ఆర్తనాదాలతో ఆ పరిసరాలు మార్మోగుతున్నాయి. కుప్పలుగా పడిఉన్న మృతదేహాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. బాధితులను ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. ప్రమాదంలో గాయపడిన బాధితుల బాధ వర్ణనాతీతంగా మారింది. బాధను పంటిబిగువున భరిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

రైలుప్రమాదంలో సహాయకచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అంబులెన్స్ల సైరన్లతో భీతావహ పరిస్థితి కనిపిస్తోంది. 14 యూనిట్ల NDRF బృందాలు బాధితులకు సాయం చేస్తున్నాయి. రెస్క్యూలో SDRF బృందాలు సైతం పాలుపంచుకున్నాయి. 12వందల మందికిపైగా సిబ్బంది, 38 ఫైర్సేఫ్టీ సిబ్బంది సహాయకచర్యల్లో ఉన్నారు.

రైలు ప్రమాదంలో గాయపడిన వెయ్యికిపైగా బాధితులను ఇప్పటికే ఆసుపత్రులకు తరలించారు. బాధితుల తరలింపునకు 250 అంబులెన్స్లు, 65 బస్సులను వినియోగిస్తున్నారు. 55 మొబైల్ హెల్త్ యూన్సిట్స్ ఏర్పాటు చేశారు అధికారులు. లిఫ్టింగ్ ప్యాడ్స్తో మరో 240 మంది సిబ్బంది ప్రత్యేకంగా సాయం చేస్తున్నారు.

ఒడిశా రైలు ప్రమాదంతో మొత్తం 43 రైళ్లను రద్దు చేసింది రైల్వేశాఖ. 18 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా.. 38 రైళ్లను దారిమళ్లిస్తున్నారు. హౌరా-సికింద్రాబాద్, హౌరా-బెంగళూరు, షాలిమార్-హైదరాబాద్, హౌరా-తిరుపతి, కన్యాకుమారి-హౌరా, డిబ్రూగర్-సికింద్రాబాద్ రైళ్లను పూర్తిగా రద్దుచేశారు. సికింద్రాబాద్-షాలిమార్, బెంగళూరు-గౌహతి, డిబ్రూగర్-సికింద్రాబాద్ రైళ్లను దారిమళ్లించారు.

ఘోరప్రమాదంలో రైల్వే 'కవచ్' టెక్నాలజీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైలు ఢీకొనకుండా 2022లో ప్రత్యేకంగా కవచ్ టెక్నాలజీ తీసుకువచ్చారు. రైళ్లు ఢీకొనకుండా ఆటోమెటిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అయినా.. ఒడిశా రైలు ప్రమాదంలో కవచ్ టెక్నాలజీ పనిచేయకపోవడం అనుమానాలు రేకిత్తిస్తోంది. కవచ్ టెక్నాలజీ కోసం 400 కోట్లు రూపాయలు ఖర్చు చేసింది రైల్వేశాఖ.

రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో బాధితుల కోసం బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి అక్కడే రక్తం అందిస్తున్నారు. పరిస్థితి విషమించిన వారిని అంబులెన్స్ల్లో సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

ఒడిశాలో రైలు ప్రమాదంతో 4 రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడు ప్రమాదంపై ఆరాతీస్తున్నాయి. మృతులు, క్షతగాత్రుల వివరాలపై అధికారులతో సమాచారం తెప్పించుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా ఆయా రాష్ట్రాల్లో రైలు సేవలపై ఫోకస్ పెట్టాయి.




