ఆ విషయంలో టాలీవుడ్ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోండి!
రీ రిలీజ్ కల్చర్ కూడా కరోనా వైరస్ లాంటిదే. మొదలయ్యాక ఒక్కచోట ఉండదు.. అన్నిచోట్లకు పాకిపోతుంది. కావాలంటే చూడండి.. ఏదో సరదాకి తెలుగు ఇండస్ట్రీలో మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు ఇండియా అంతా వ్యాపించింది. బాలీవుడ్ను అయితే ప్రస్తుతం కుదిపేస్తుంది. అక్కడ పాత సినిమాలు వరసగా క్యూ కడుతూనే ఉన్నాయి.
Updated on: Jan 10, 2025 | 7:43 PM

మూడేళ్ళ కింద మహేష్ బాబు పుట్టిన రోజుకు అప్డేట్స్ ఏవీ లేవని.. పోకిరి సినిమాను రీ రిలీజ్ చేసారు. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి గత మూడేళ్లలో దాదాపు 40 సినిమాల వరకు రీ రిలీజ్ అయ్యాయి. తమిళంలోనూ గిల్లీతో ఈ ట్రెండ్ ఊపందుకుంది.

తాజాగా బాలీవుడ్ వంతు. అక్కడ పాత సినిమాలకు దుమ్ము దులుపుతూనే ఉన్నారు మేకర్స్. తన అభిమాన హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేయడంతో అభిమానులు తమ హీరోల సినిమాలను మళ్లీ థియేటర్లో చూస్తూ , చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

2024లో బాలీవుడ్కు రీ రిలీజ్ల నుంచే ఏకంగా 65 కోట్లు వచ్చాయి. అందులో తుంబాడ్ 35 కోట్లతో టాప్లో ఉంది. రీ రిలీజ్లో ఇండియన్ హైయ్యస్ట్ గ్రాసర్ కూడా ఇదే. 2018లో విడుదలైనపుడు తుంబాడ్కు వచ్చింది 15 కోట్లే. కానీ రీ రిలీజ్లో రప్ఫాడించింది. అలాగే యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రి నటించిన లైలా మజ్నుకు రీ రిలీజ్లోనే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.

లైలా మజ్ను 2018లో విడుదలైనపుడు కనీసం 2 కోట్లు కూడా రాలేదు. కానీ 2024లో ఈ సినిమాకు 14 కోట్లు వచ్చాయి. అలాగే రణ్బీర్ కపూర్ రాక్ స్టార్ రీ రిలీజ్లో 6 కోట్లు వసూలు చేయగా.. ఏ జవానీ హై దివానీ 3 కోట్లు, కల్ హో నా హో 5.80 కోట్లు వసూలు చేసాయి. వీర్ జారా 3.15 కోట్లు రాగా.. రెహనా హై తేరే దిల్ మే సినిమాకు రీ రిలీజ్లో 4 కోట్లు వచ్చాయి.

రీ రిలీజ్ సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ చూసాక.. అస్సలు ఆగట్లేదు నిర్మాతలు. క్లాసిక్స్ అన్నింటికీ మరోసారి దుమ్ము దులుపుతున్నారు. చెక్ దే ఇండియా, లగాన్, బివి నెం 1, రబ్ నే బనాదీ జోడీ, అజబ్ ప్రేమ్కీ గజబ్ కహానీ లాంటి సినిమాలను త్వరలోనే మళ్లీ విడుదల చేయబోతున్నారు. మొత్తానికి బాలీవుడ్లోనూ రీ రిలీజ్ ట్రెండ్ పరుగులు పెడుతుందిప్పుడు.