మీడియా మొఘల్ రామోజీ రావు మరణవార్త అందరినీ కలిచివేసింది. సినిమా రంగంతో పాటు టీవీ రంగానికి, మీడియాకు ఆయన చేసిన సేవలు అందరూ కొనియాడారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఎన్నో సాధించిన రామోజీ రావుకు ఒక్క కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. చివరికి అది తీరకుండానే ఆయన వెళ్లిపోయారు.
మీడియా దిగ్గజం రామోజీ రావు మరణం ఆయన అభిమానులతో పాటు అందరినీ కలిసివేసింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి ఆయన ఎంతో చేసారు. ఉషాకిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘మయూరి’, ‘ప్రతిఘటన’, ‘ప్రేమించు పెళ్లాడు’, ‘చిత్రం’, ‘నువ్వే కావాలి’, ‘ఆనందం’ సహా ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు.
ఉషా కిరణ్ మూవీస్లో ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశం కల్పించారు రామోజీ రావు. ఆయన పరిచయం చేసిన వాళ్లెందరో ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్నత స్థానంలో ఉన్నారు. తరుణ్, శ్రీయ, కళ్యాణ్ రామ్, ఆకాశ్, ఉదయ్ కిరణ్ లాంటి నటులందర్నీ పరిచయం చేసింది రామోజీ రావే.
నిన్ను చూడాలనితో జూనియర్ ఎన్టీఆర్ను హీరోగా పరిచయం చేసారు మీడియా మొఘల్. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన రామోజీ రావుకు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో 100 సినిమాలు నిర్మించాలనే కోరిక ఉండేది.
ఈ సంస్థలో దాదాపు 85 సినిమాలొచ్చాయి. 2015లో చివరగా దాగుడు మూతల దండాకోర్ తర్వాత రామోజీ రావు మరే సినిమా నిర్మించలేదు. 100 సినిమాల కోరిక నెరవేరకపోయినా.. మరో 100 ఏళ్లకు సరిపోయే ఖ్యాతి సంపాదించుకున్నారు రామోజీ రావు.