బాహుబలి బంగాళాదుంపలు.. ఒక్కో దుంప రూ.40 విక్రయిస్తున్న రైతు!
ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా శంషాబాద్ ప్రాంతానికి చెందిన రైతు దినేష్ కుమార్ రాజ్ పుత్ పేరు మారుమోగిపోతుంది. రసీద్ పూర్ తరాయి గ్రామానికి చెందిన ఇతను తన 3 భిఘాల పొలంలో అంటే సుమారు 2 ఎకరాల్లో ఆలుగడ్డలు వేశాడు. సాధారణంగా ఒక ఆలుగడ్డ 100 నుంచి 300 గ్రాముల బరువు పెరిగితే..

ఏలూరు, ఫిబ్రవరి 17: గోదావరిజిల్లాల్లో అధిక బరువున్న చేపలు వలకు చిక్కి మత్స్య కారులకు ఒక్కోరోజు కాసులు కురిపిస్తాయి. మొన్నటికి మొన్న కంద గడ్డలో వినాయకుడు రూపం కనిపించి పూజలు అందుకున్నాడు. అయితే రైతు పండించే పంటకు గిరాకీ రావాలంటే అది ఎంతో కొంత ప్రత్యేకంగా వుండాలి కదా..! ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా శంషాబాద్ ప్రాంతానికి చెందిన రైతు దినేష్ కుమార్ రాజ్ పుత్ పేరు మారుమోగిపోతుంది. రసీద్ పూర్ తరాయి గ్రామానికి చెందిన ఇతను తన 3 భిఘాల పొలంలో అంటే సుమారు 2 ఎకరాల్లో ఆలుగడ్డలు వేశాడు. సాధారణంగా ఒక ఆలుగడ్డ 100 నుంచి 300 గ్రాముల బరువు పెరిగితే.. దినేష్ కుమార్ రాజ్ పుత్ పొలంలో మాత్రం ఒక్కో బంగాళదుంప 2 కేజీల బరువు తూగుతుంది.
దీంతో ఆయన పొలానికి పరిసరగ్రామాల ప్రజలు వెళ్లి అధికదిగుబడి ఇచ్చే బంగాళ దుంప ఎలాపండిందో తెలుసుకుంటున్నారు. ఇంత బరువు రావడానికి వాతావరణం అనుకూలించడంతో పాటు మంచి విత్తన ఎంపిక, సరైన ఎరువుల వినియోగం, వ్యవసాయవిధానాలు కారణమని ఆప్రాంత వ్యవసాయ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ఫరూఖాబాద్ ప్రాంత వాసులకు 2 కేజీ ల బరువు ఉన్న ఆలుగడ్డలు చూడటం ఇది కొత్తకాదు. ఈ ప్రాంతం నుంచి కేవలం మనదేశంలో మాత్రమే కాక ఇతరదేశాలకు ఆలుగడ్డలు ఎగుమతి అవుతాయి.
ఆలుగడ్డలకు ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ ఫరూఖాబాద్లో ఉండటంతో తరుచుగా అతిపెద్ద ఆలుగడ్డలు మార్కెట్కి వస్తుంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం క్వింటాల్ ఆలుగడ్డల ధర రూ.1200 నుంచి రూ.2000 వరకు పలుకుతుంది. అంటే ఈ లెక్కన దినేష్ కుమార్ రాజ్ పుత్ పండించిన ఒక్కో బంగాళాదుంప 40 రూపాయలు ఉంటుంది. రిటైల్ మార్కెట్స్ లో అయితే రూ.80 కూడ పలుకవచ్చు. ఏపీలో ఆలుగడ్డలు సాగు నామమాత్రంగానే ఉంటుంది. ఇది పండాలంటే చల్లని వాతావరణం అవసరం. చిత్తూరు, అన్నమయ్య, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడక్కడా ప్రయోగాత్మకంగా పండిస్తున్నా ఎక్కువగా ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్ల నుంచి ఇవి దిగుమతి అవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




