
Indian Railways: ఐదేళ్లు కాదు.. రైల్వే భూముల లీజు 35 ఏళ్లకు పెంచింది కేంద్ర కేబినెట్. ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. పీఎం గతి శక్తి యోజనకు నిధుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక రైల్వే శాఖలో దశలవారీగా ప్రైవేటీకరణ జరగబోతోందా? అనేది చర్చనీయాంశమైంది.
రైల్వేశాఖలో సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రైల్వే ల్యాండ్ పాలసీ సవరణలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తద్వారా రైల్వే భూముల్ని సుదీర్ఘకాలంగా లీజుకు ఇవ్వాలనే అంశంపై లైన్ క్లియర్ అయ్యింది. పీఎం గతిశక్తి పథకానికి నిధుల కోసం రైల్వే భూములు లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. అలాగే రైల్వే ల్యాండ్ లైసెన్స్ ఫీజు కూడా ఆరు నుంచి 1.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఐదేళ్లుగా ఉన్న లీజ్ పీరియడ్ను.. ఏకంగా 35 ఏళ్లకు పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు ఠాకూర్ వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా 1.2 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని, రైల్వేస్కు మరింత ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారాయన. అయిదేళ్లలో 300 పిఎం గతిశక్తి కార్గో టర్మినల్స్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు.
అయితే, ప్రైవేటీకరణలో భాగంగానే కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న వాటాను కేంద్రం త్వరగతిన అమ్మేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైల్వే లీజ్ నిర్ణయం నీతి ఆయోగ్ సిఫారసుల ఆధారంగానే తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అంతకు ముందు నీతి ఆయోగ్.. 3 శాతం కంటే తక్కువగా రైల్వే ల్యాండ్ లీజింగ్ ఫీజు ఉండాలనే ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. సోలార్ ప్లాంట్స్ నిర్మాణం కోసం చౌక ధరకు రైల్వే భూములను లీజ్కు ఇవ్వాలని, పీపీపీ పద్ధతిలో రైల్వే భూములను ఆస్పత్రులు, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఇవ్వాలని కూడా కేబినెట్ భేటీలో కేంద్రం నిర్ణయించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..