
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న చిత్రం ది కేరళ స్టోరీ. ఓవైపు ఈ సినిమాను స్క్రీనింగ్ ఆపాలంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూసుకుపోతుంది. ఇప్పటికీ ది కేరళ స్టోరీ వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. లేటెస్ట్గా బెంగాల్ సర్కార్ కూడా ఈ సినిమాను బ్యాన్ చేసింది. మత ఘర్షణలకు ఛాన్సుందన్న సందేహాలతో కేరళ స్టోరీని నిషేధపు కత్తి పెట్టేసింది దీదీ ప్రభుత్వం. గత వీకెండ్లోనే రిలీజై సంచలనం సృష్టించింది కేరళ స్టోరీ. లవ్ జిహాద్ అంశంపై రూపొందిన ఈ సినిమాను ఆల్రెడీ తమిళనాడు ప్రభుత్వం పాక్షికంగా నిషేధించింది. మెట్రో సిటీస్లో థియేటర్లలో ప్రదర్శనకు నో చెప్పేసింది. ఇప్పుడు బెంగాల్ కూడా బ్యాన్ చేసింది.
హిందూ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వలేసి వాళ్లను దేశాల్ని దాటించి, మిలిటెంట్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారన్న అంశంపై కేరళ స్టోరీ తెరకెక్కింది. సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాను కొన్ని కత్తెర్ల తర్వాత గో ఎహెడ్ చెప్పింది. రిలీజైన తర్వాత కూడా రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది కేరళ స్టోరీ. సినిమా కంటెంట్ బీజేపీకి అనుకూలంగా ఉందన్న వార్తన నడుమ… నాన్-బీజేపీ ప్రభుత్వాలు కేరళ స్టోరీపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే బెంగాల్ ప్రభుత్వం సినిమాను నిషేధించిందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే..బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా దూసుకుపోతుంది. ఫస్డ్ డే రూ.8.02 కోట్లు.. సెకండ్ డే రూ. 11.22 కోట్లు రాబట్టింది. ఇక ఈ ఆదివారం ఏకంగా రూ. 16 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఇప్పటివరకు ఈ మూవీ రూ. 35 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్ కాకపోయినప్పటికీ మూడు రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ తరహాలో సాలిడ్ మౌత్ టాక్ కారణం గా మంచి వసూళ్లు రాబడుతోంది. ఇందులో ఆదా శర్మ కథానాయికగా నటించింది.