RSS శతాబ్ది వేళ కీలక సందేశం.. జాతీయ ఐక్యత, సేవ, స్వీయ క్రమశిక్షణకు ప్రాధాన్యం!
భారత్ను సజీవ నాగరికతగా ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ ఐక్యత, సామాజిక సామరస్యం, సేవ, స్వీయ క్రమశిక్షణ అవసరమని RSS పేర్కొంది. గుర్తింపు రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. పంచ ప్రాణాల ద్వారా సామాజిక సమృద్ధి, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ విలువలు, స్వదేశీ, పౌర బాధ్యతలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చింది.

భారతదేశం కేవలం ఆధునిక దేశం మాత్రమే కాదని.. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సజీవ నాగరికత అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన శతాబ్ది సంవత్సరంలో పేర్కొంది. దేశ భవిష్యత్తును నిర్మించేందుకు గతంలోని నాగరిక విలువలను అర్థం చేసుకోవడంతో పాటు, సామాజిక ఐక్యత, సేవ, నైతిక విలువలు, స్వీయ క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది.
భారత నాగరికతలో ఐక్యత, శాంతియుత సహజీవనం, పరస్పర సామరస్యం వంటి విలువలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయని RSS అభిప్రాయపడింది. మాతృభూమితో ప్రజలకు ఉన్న అనుబంధం, తోటి పౌరులను ఒకే కుటుంబ సభ్యులుగా చూసే భావన దేశ ఐక్యతకు పునాదిగా ఉండాలని పేర్కొంది. ప్రతి పౌరుడు దేశం పట్ల తన బాధ్యతను గుర్తించి, తన సమయం, సామర్థ్యం, వనరులను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని సూచించింది.
కేవలం రాజకీయ మార్పులు లేదా ఆర్థిక అభివృద్ధితోనే దేశ ప్రగతి పూర్తికాదని RSS పేర్కొంది. సాంస్కృతిక చైతన్యం, వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక విలువలు కూడా జాతీయ అభివృద్ధిలో కీలకమని తెలిపింది. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామూహిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చే పౌర సమాజం అవసరమని అభిప్రాయపడింది.
గుర్తింపు రాజకీయాలపై ఆందోళన
కులం, భాష, ప్రాంతం, మతం, లింగం, రాజకీయ అనుబంధం వంటి భిన్న గుర్తింపులు సహజమైనవేనని.. అయితే వాటిని పరస్పర పోటీ లేదా విభజనకు కారణాలుగా మార్చకూడదని RSS పేర్కొంది. భారతదేశంలోని వివిధ భాషలను పోటీ శక్తులుగా కాకుండా, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసే సోదర భాషలుగా చూడాలని సూచించింది. అదేవిధంగా రాష్ట్రాలు పరిపాలనా విభాగాలేనని, ప్రాంతీయ గుర్తింపులు జాతీయ సమైక్యతను బలహీనపరిచే స్థాయికి వెళ్లకూడదని పేర్కొంది. బౌద్ధ, జైన, సిక్కు తదితర సంప్రదాయాలను కూడా భారతదేశ సుదీర్ఘ నాగరిక ప్రయాణంలో భాగంగా చూడాలని తెలిపింది.
పంచ ప్రాణాలకు ప్రాధాన్యం
RSS శతాబ్ది సంవత్సరంలో సామాజిక చైతన్యం కోసం ‘పంచ ప్రాణాలు’ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. సామాజిక సమృద్ధి, పర్యావరణ అనుకూల జీవనశైలి, కుటుంబ ప్రబోధం, స్వయంవాలంబన్-స్వదేశీ, పౌరుల ప్రాథమిక విధుల నిర్వహణ వంటి అంశాలను ప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహించాలని పేర్కొంది. ప్రజల భాగస్వామ్యం లేకుండా జాతీయ లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదని RSS అభిప్రాయపడింది. చర్చ, ఆత్మపరిశీలన, పరస్పర గౌరవం, నిర్మాణాత్మక సంభాషణ ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపింది.
యువత దేశ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ.. జాతీయ ఐక్యత, సేవాభావం, స్వీయ క్రమశిక్షణ వంటి విలువలను విస్తృతంగా స్వీకరించాలని పిలుపునిచ్చింది. భారతదేశాన్ని సజీవ నాగరికతగా కొనసాగించడంతో పాటు, రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉందని RSS సందేశం ఇచ్చింది.
