అసెంబ్లీని సమావేశపరుస్తా…కానీ..రాజస్తాన్ గవర్నర్ షరతు
రాజస్తాన్ లో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికీ మారిపోతున్నాయి. అసెంబ్లీని సమావేశపరచాలన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభ్యర్థనను మొదట తిరస్కరించిన గవర్నర్ కల్ రాజ్ మిశ్రా..
రాజస్తాన్ లో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికీ మారిపోతున్నాయి. అసెంబ్లీని సమావేశపరచాలన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభ్యర్థనను మొదట తిరస్కరించిన గవర్నర్ కల్ రాజ్ మిశ్రా.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మీ ఎమ్మెల్యేలకు 21 రోజుల నోటీసు ఇచ్చేందుకు మీ ప్రభుత్వం అంగీకరిస్థే సభను సమావేశపరుస్తానని ఆయన తాజా ప్రతిపాదన పంపినట్టు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సెషన్ ని నిర్వహించరాదన్న ఉద్దేశం తమకు లేదని ఈ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ కరోనా తరుణంలో ఇంత తక్కువ వ్యవధిలో అసెంబ్లీని సమావేశపరచడం కష్టసాధ్యమని, సభ సమావేశమైనప్పుడు భౌతిక దూరం పాటింపు వంటివి జటిల సమస్యను సృష్టిస్తాయని రాజ్ భవన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సభలో ఫ్లోర్ టెస్ట్ జరిగితే దాన్ని, సభా కార్యకలాపాలను ప్రభుత్వం లైవ్ గా ప్రసారం చేయాలని గవర్నర్ కోరినట్టు తెలుస్తోంది.
అటు-బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో ‘విలీనం’ చేయడాన్ని సవాలు చేస్తూ..మదన్ దిల్వార్ అనే బీజేపీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్ ని రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. ఇది అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి ఊరటే!