
ఢిల్లీలో లోక్ సభ సమావేశాలు సజావుగా సాగాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాదీ వేడీ చర్చల మధ్య ఓటాన్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. మొన్నటికే బడ్జెట్ సమావేశాలు ముగిసినప్పటికీ శనివారం ఒక్కరోజు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రధాని. అయితే ఈ 17వ లోక్ సభకు ఇదే చివరి సమావేశం కావడంతో కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఐదేళ్లలో గేమ్ చేంజింగ్ సంస్కరణలు తెచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. నోట్ల రద్దు మొదలు తాజాగా అందజేసిన పౌర పురస్కారాల వరకు అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. తమ పాలనలో మొత్తం 222 బిల్లులను ఆమోదించామన్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు కఠిన చట్టాలు తెచ్చామన్నారు. వాడుకలో లేని అనేక చట్టాలను తొలగించామన్నారు మోదీ. పార్లమెంట్ సమావేశాల చివరిరోజు లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము తీసుకున్న చారిత్రాక నిర్ణయాలను గుర్తు చేశారు.
పార్లమెంట్ ఆమోదించిన బిల్లుల గురించి ప్రస్తావించారు మోదీ. ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూకశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. మహిళా బిల్లును ఆమోదించడం ద్వారా మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పామన్నారు ప్రధాని. ట్రిపుల్ తలాఖ్ బిల్లు ఆమోదం ద్వారా ముస్లిం సోదరీమణుల బాధలు తొలగించామన్నారు ప్రధాని మోదీ. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని చట్టాలను కూడా సవరించామని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాటిని సవరించామన్నారు. అలాగే యావత్ దేశం గర్వించదగ్గ కట్టడమైన ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి కూడా ప్రస్తావించారు ప్రధాని మోదీ. తమ ప్రభుత్వ హయాంలో ప్రజల మద్దతుతో కొవిడ్ సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నామన్నారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను తొలగించి భారతీయులకు అనుకూలంగా కొత్త చట్టాలు తెచ్చామన్నారు ప్రధాని మోదీ. ట్రాన్స్జెండర్లకు పద్మ అవార్డులు ఇచ్చిన విషయాన్ని కూడా మోదీ గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కమలం పార్టీ మరోసారి గుబాళిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 18వ లోక్సభ కూడా దృఢంగా సాగుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..