ఇంటి కింద బంగారు ప్యాలెస్.. టీఎంసీ నేత రాజభోగాలు చూస్తే మైండ్ బ్లాంకే.. ఎలా బయటపడిందంటే..?
బయటకు చూస్తే ఒక సామాన్యమైన ఇల్లు.. కానీ లోపలికి వెళ్తే కళ్లు బైర్లు కమ్మే విలాసవంతమైన ప్యాలెస్.. పశ్చిమ బెంగాల్ టీఎంసీ నేత షమీమ్ అహ్మద్ నివాసంపై జరిగిన పోలీసుల దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూగర్భంలో ఏర్పాటు చేసుకున్న రహస్య గదిలో ఏకంగా బంగారు మంచాన్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. అసలు ఈ అక్రమ సామ్రాజ్యం గుట్టు ఎలా రట్టయ్యిందో తెలుసుకుందాం..

పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో టీఎంసీ నేత షమీమ్ అహ్మద్ నివాసంపై జరిగిన పోలీసుల దాడిలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక సాధారణ ఇంటి కింద అత్యంత విలాసవంతమైన రహస్య భూగర్భ ప్యాలెస్ను చూసి అధికారులు అవాక్కయ్యారు. పోలీసులు జరిపిన ఈ ఆకస్మిక సోదాల్లో సుమారు 250 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ.1.25 లక్షల నగదు పట్టుబడింది. కేవలం నగదు మాత్రమే కాకుండా ఇంటి లోపల ఉన్న విలాసవంతమైన ఏర్పాట్లు అందరినీ విస్మయానికి గురిచేశాయి. ఈ రహస్య గదిలో ఏకంగా ఒక బంగారు మంచాన్ని అధికారులు గుర్తించారు. అహ్మద్ తన ఇంటి అడుగున నిర్మించుకున్న ఈ రహస్య రాజభవనంలో విదేశాల నుంచి తెప్పించిన ఖరీదైన పరుపులు, సోఫాలను ఏర్పాటు చేసుకున్నారు. బయటకు ఒక సామాన్యమైన ఇల్లులా కనిపించినా లోపల మాత్రం కోట్లాది రూపాయల విలువైన ఇంటీరియర్ డిజైనింగ్తో కూడిన గదులు ఉన్నాయి.
షమీమ్ అహ్మద్ తన భార్య పేరిట ఈ ఆస్తులను కూడబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్రమ ఆస్తుల సంపాదన, ఆర్థిక అక్రమాల ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో అహ్మద్ ఇంట్లో లేకపోవడంతో అతను పరారీలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. టీఎంసీ నేత ఇంట్లో దొరికిన ఈ విలాసవంతమైన వస్తువుల ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సామాన్య ప్రజల సొమ్ముతో ఇలాంటి విలాసాలు ఎలా సాధ్యమని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకొని అక్రమ సంపాదనకు తెరలేపారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో కూడా బెంగాల్లోని పలువురు రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు జరిగినప్పుడు భారీగా నగదు పట్టుబడింది. అయితే ఇలా భూగర్భంలో ఏకంగా బంగారు మంచంతో కూడిన ప్యాలెస్ బయటపడటం ఇదే మొదటిసారి. ఈ కేసులో మరిన్ని లోతైన విచారణలు జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అక్రమార్కుల గుట్టు రట్టు చేసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. షమీమ్ అహ్మద్ పట్టుబడితే మరిన్ని కీలక విషయాలు, ఇతర బడా నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటన బెంగాల్ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపింది.
