PM Modi: మరోసారి పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన ప్రధాని మోదీ! మన్ కీ బాత్లో మాట్లాడుతూ..
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కి బాత్ కార్యక్రమంలో తీవ్రంగా ఖండించారు. దాడిలో మృతి చెందినవారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కోపాన్ని ప్రస్తావిస్తూ, దాడికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడుతుందని హామీ ఇచ్చారు.

జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన భయంకరమైన దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. పహల్గామ్ దాడి గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు నేను మీతో మన్ కీ బాత్ గురించి మాట్లాడుతున్నప్పుడు నా గుండెల్లో తీవ్ర బాధ ఉంది. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద సంఘటన దేశంలోని ప్రతి పౌరుడిని బాధపెట్టింది. ఈ ఉగ్రవాద దాడి చిత్రాలను చూసిన తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందని నాకు తెలుసు. పహల్గామ్లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశను, వారి పిరికితనాన్ని చూపిస్తుంది. ఉగ్రవాదులు, దాని వెనుక ఉన్నవారు కశ్మీర్ మళ్ళీ నాశనం కావాలని కోరుకుంటున్నారు. అందుకే వారు ఇంత పెద్ద కుట్ర చేశారు. ఉగ్రవాదంపై జరుగుతున్న ఈ యుద్ధంలో దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం మనకు అతిపెద్ద బలం.
బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి ఉందని ఆయన అన్నారు. అతను ఏ రాష్ట్రానికి చెందినవాడైనా, ఏ భాష మాట్లాడినా, ఈ దాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి బాధను అంతా అనుభవిస్తున్నాడు. కశ్మీర్లో శాంతి తిరిగి వస్తున్న సమయంలో పాఠశాలలు, కళాశాలల్లో ఉత్సాహం నెలకొంది. నిర్మాణ పనులు అపూర్వమైన వేగం పుంజుకున్నాయి, ప్రజాస్వామ్యం బలపడుతోంది, పర్యాటకుల సంఖ్యలో రికార్డు పెరుగుదల ఉంది, ప్రజల ఆదాయం పెరుగుతోంది, యువతకు కొత్త అవకాశాలు వస్తున్నాయి ఇలాంటి విషయాలు దేశ శత్రువులు, జమ్మూ కశ్మీర్ శత్రువులకు నచ్చలేదు.
ఈ ఉగ్ర దాడి తర్వాత దేశం మొత్తం ఒకే గొంతులో మాట్లాడుతుంది ప్రధాని అన్నారు. భారతదేశ ప్రజల్లో ఉన్న కోపం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ ఉగ్రవాద దాడి తరువాత, ప్రపంచం నలుమూలల నుండి సంతాప సందేశాలు నిరంతరం వస్తున్నాయి. ప్రపంచ నాయకులు కూడా నాకు ఫోన్ చేశారు, లేఖలు రాశారు. ఈ హేయమైన ఉగ్రవాద దాడిని అందరూ తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మరోసారి హామీ ఇస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితులకు, కుట్రదారులకు కఠినంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
