మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందేభారత్ రైళ్లు.. దేశవ్యాప్తంగా రాకపోకలు సాగిస్తున్నాయి. సర్వీసులు, ప్రయాణించాల్సిన దూరం, కొత్త రూట్లు.. ఇలా రోజు రోజుకు దూసుకుపోతోంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ ( సికింద్రాబాద్ – విశాఖపట్నం ) ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనికి ప్రజల నుంచి కూడా విశేష ఆదరణ లభిస్తోంది. అయితే.. ఇప్పుడు మరో రూట్ కు వందేభారత్ సిద్ధమైంది. తదుపరి వందే భారత్ రైలు.. పూరీ – హౌరా మధ్య నడిపించాలని అధికారులు నిర్ణయించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఈ రైలు జనవరి 23న బయలుదేరనుంది.
తొమ్మిదో వందే భారత్ ఎక్స్ప్రెస్ సిద్ధంగా ఉంది. ఈస్టర్న్ సెక్టార్లో పూరీ – భువనేశ్వర్ – హౌరా మార్గంలో ఈ రైలు సేవలు అందిస్తుంది. కోణార్క్, సముద్ర తీరం, జగన్నాథ దేవాలయం వంటి ఇతర ప్రాంతాల మధ్య తిరుగుతుందని అధికారులు వివరించారు. కాగా.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో పూరీ నుంచి నడపనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలోనే ప్రకటన చేశారు. దేశంలోని ప్రతి మూలను కలుపుతామని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనలో భాగంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ను పూరీ వరకు పొడిగించనున్నట్లు చెప్పారు.
మరోవైపు.. సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, ఫుణె, తిరుపతి నగరాలకు మూడు రైళ్లను నడిపించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకవేళ ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే వాటిని హైదరాబాద్లోని కాచిగూడ స్టేషన్ నుంచి బెంగుళూరుకు, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఫుణెకు, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తిరుపతికి నడిపే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..