AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికార్డ్ స్థాయిలో కూలుతున్న వంతెనలు.. పక్షం రోజుల్లో 10 బ్రిడ్జ్‎లు

బీహార్‌లో వంతెనలు వరుసగా కూలుతున్నాయి. దాంతో.. బిహార్‌ బ్రిడ్జ్‌ ఘటనలు దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. తాజాగా ఒక్క రోజులోనే సివాన్‌ జిల్లాలో మూడు చిన్న వంతెనలు కూలిపోగా.. సరన్‌ జిల్లాలో మరొకటి కుప్పకూలింది. ఫలితంగా.. 15 రోజుల్లోనే బీహార్‌లో 10 బ్రిడ్జ్‌లు కూలినట్లు అయింది. గత నెల 18 నుంచి బిహార్‌లోని కిషన్‌గంజ్‌, అరారియా, మధుబని, తూర్పు చంపారన్‌, సివాన్‌లో వరసగా వంతెనలు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లో మౌలిక సదుపాయాల స్థితిపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

రికార్డ్ స్థాయిలో కూలుతున్న వంతెనలు.. పక్షం రోజుల్లో 10 బ్రిడ్జ్‎లు
Bihar
Srikar T
|

Updated on: Jul 05, 2024 | 7:11 AM

Share

బీహార్‌లో వంతెనలు వరుసగా కూలుతున్నాయి. దాంతో.. బిహార్‌ బ్రిడ్జ్‌ ఘటనలు దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. తాజాగా ఒక్క రోజులోనే సివాన్‌ జిల్లాలో మూడు చిన్న వంతెనలు కూలిపోగా.. సరన్‌ జిల్లాలో మరొకటి కుప్పకూలింది. ఫలితంగా.. 15 రోజుల్లోనే బీహార్‌లో 10 బ్రిడ్జ్‌లు కూలినట్లు అయింది. గత నెల 18 నుంచి బిహార్‌లోని కిషన్‌గంజ్‌, అరారియా, మధుబని, తూర్పు చంపారన్‌, సివాన్‌లో వరసగా వంతెనలు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లో మౌలిక సదుపాయాల స్థితిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. దాంతో.. బీహార్ ప్రభుత్వం దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా ఘటనలు నమోదైన జిల్లాల అధికార యంత్రాంగాల నుంచి నితీశ్‌ సర్కార్‌ సమగ్ర నివేదిక కోరింది. నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో ఉత్తర బిహార్‌లోని నదుల నీటి మట్టాన్ని పర్యవేక్షించాలని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ.. చీఫ్‌ ఇంజనీర్లను ఆదేశించింది.

ఇదిలావుంటే.. బిహార్‌లో వంతెనలు కూలిపోతున్న ఘటనలపై ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ విరుచుకుపడుతోంది. ఎక్స్‌ వేదికగా స్పందించిన ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌.. బిహార్‌లో ఒకే రోజులో 4 వంతెనలు ఎలా కూలిపోయాయి?.. దోషులెవరు?.. ఎన్డీఏ ప్రభుత్వం చెప్పాలన్నారు. ప్రధాని మోదీ, సీఎం నితీష్‌కుమార్‌ ఇప్పటికైనా వంతెనలు కూలిపోవడంపై నోరు మెదపాలని డిమాండ్‌ చేశారు. సుపరిపాలన, అవినీతి రహిత ప్రభుత్వం అనే వాదనలు ఎమయ్యాయని ప్రశ్నించారు. బిహార్‌లో ఏ శాఖలో ఎంత అవినీతి రాజ్యమేలుతుందో ఈ ఘటనలే నిదర్శమన్నారు తేజస్వీయాదవ్‌. ఇక.. ప్రతిపక్ష నేతల ఆరోపణలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తేజస్వియాదవ్‌ కామెంట్స్‌ కౌంటర్‌ ఇచ్చేందుకు ప్రయత్నించింది. బిహార్‌లో పాత వంతెనలన్నింటిని సర్వే చేయాలని.. బిడ్జిలు కూలిన ఘటనలపై విచారణ జరపాలని సీఎం నితీశ్‌కుమార్‌ ఆదేశించినట్లు తెలిపారు బిహార్‌ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి.

మరోవైపు.. నిర్మాణ నాణ్యత, ఉపయోగించిన వస్తువులపైనా ఫోకస్‌ పెట్టింది నితీస్‌ సర్కార్‌. వంతెనల నిర్వహణపై ప్రభుత్వం సమగ్ర రిపోర్ట్‌ రూపొందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రధానంగా.. వర్షాకాలం నేపథ్యంలో బిహార్‌లోని నదుల్లో పూడికతీత పనులకు కాంట్రాక్టులు జారీ అయ్యాయి. బ్రిడ్జి పిల్లర్ల చుట్టూ మట్టి తొలగించడంతో వాటికి ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని చెప్తున్నారు. దాని వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, దానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు బిహార్‌ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వంతెన పూడికతీత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవడంలో కాంట్రాక్టర్లు నిర్లక్షం వహించినట్లు తెలుస్తోందన్నారు. అయితే.. వంతెనల కూలిపోవడానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు అంటున్నారు బిహార్‌ అధికారులు. మొత్తంగా.. బిహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలిపోవడంతో కలకలం రేపుతోంది. అటు.. ప్రతిపక్షం ఆరోపణల నేపథ్యంలో బ్రిడ్జ్‌ల నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us