Presidential Election 2022: ప్రతిపక్ష అభ్యర్థిని బరిలో నిలిపేందుకు కాంగ్రెస్ కసరత్తులు.. కీలక నేతలతో సంప్రదింపులు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని ఓడించేందుకు ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి కోసం కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు సోనియా గాంధీ వివిధ పార్టీల నేతలతో మాట్లాడారు..
Presidential Election 2022 – Congress: భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక బీజేపీకి కాస్త సవాలుగా మారనుంది. ఎలక్టొరల్ కాలేజీ ఓట్లలో 50 శాతానికిపైగా సాధించాలంటే ఎన్డీఏ కూటమికి మరో 1.2 శాతం ఓట్లు అవసరం.. ఈ స్వల్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ నిర్ణయించే అభ్యర్థి ఎవరు అనేది ఇంకా నిర్ణయం కాలేదు. అయినప్పటికీ అధికార పక్షం అభ్యర్థికి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ దిశగా అన్ని విపక్షాలను కలుపుకొని ముందుకు వెళ్లేందుకు వ్యూహ రచన మొదలు పెట్టింది. తదుపరి రాష్ట్రపతి పదవి ఎన్నిక కోసం ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందు కోసం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిపక్షాల నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు.
ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తమిళనాడు సీఎం-డీఎంకే చీఫ్ స్టాలిన్లతో సోనియా గాంధీ స్వయంగా మాట్లాడారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వీరితోపాటు మమతా బెనర్జీతో కూడా ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వారినుంచి పలు సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.
ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయంలో ఇతర విపక్షాలతో చర్చలు జరిపి, ఏకాభిప్రాయాన్ని సాధించే బాధ్యతను సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు సోనియా గాంధీ. వివిధ పార్టీలు సూచించిన పేర్లను తీసుకొని, అందులోంచి అభ్యర్థిని ఎంపిక చేస్తామని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.. మరోవైపు మూడో అభ్యర్థి కూడా రంగంలో ఉండే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..