మాల్దీవుల్లో చిక్కుబడిన భారతీయులను తరలించేందుకు బయల్దేరిన ఐఎన్ఎస్ జలాశ్వ యుధ్ధ నౌక గురువారం మాల్దీవుల రాజధాని మాలె చేరుకుంది. ‘ఆపరేషన్ సముద్ర సేతు’ పేరిట తొలి దశలో భాగంగా భారత నౌకాదళం ఈ నౌకను ఇందుకు వినియోగిస్తోంది. ఈ జలాశ్వ తో బాటు ఐఎన్ఎస్ మగర్ కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంటోంది. మాల్దీవుల్లో ఉన్న సుమారు వెయ్యిమంది భారతీయులను ఈ నౌకలు స్వదేశానికి తరలించనున్నాయి. వీరంతా కోవిడ్-19 ప్రికాషన్స్ ని పాటించవలసి ఉంటుందని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మాధ్వాల్ తెలిపారు. సముద్ర మార్గం ద్వారా ప్రయాణించేటప్పుడు వీరికి వైద్య సంబంధ సదుపాయాలతో సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. వీరిని కేరళలోని కొఛ్చి రేవులో దింపుతామని, అన్ని పరీక్షలు పూర్తి అయ్యాక రాష్ట్ర అధికారులకు అప్పగిస్తామని వివేక్ వెల్లడించారు. రక్షణ, విదేశాంగ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలతోను, ఇతర ప్రభుత్వ సంస్థలతోను సమన్వయంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.