
ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత చట్టాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆగ్రాలో మెట్రోరైల్ ప్రాజెక్ట్ వర్చువల్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ మాటలు మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో రూ.వంద లక్షల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్స్ను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
అంతేకాకుండా కొత్త చట్టాలు తీసుకొచ్చి సంస్కరణలు చేపట్టడం దేశానికి చాలా అవసరమని చెప్పారు. ఎందుకంటే గత కాలంలో ఉపయోగపడిన చట్టాలు, అధికరణలు పస్తుత కాలానికి అనువైనవిగా ఉండకపోవచ్చన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అవి ప్రజలకు భారంగా కూడా మారొచ్చని అన్నారు. అందుకే బీజేపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చట్టాలను సవరించి ప్రజలకు అవసరమైన విధంగా రూపొందిస్తుందని తెలిపారు. అందుకే దేశ ప్రజలు మాపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారని ప్రకటించారు అందుకు నిదర్శనమే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను చూపించారు. అయితే ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న క్రమంలో ప్రధాని నోటివెంట ఇటువంటి మాటలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రైతులకు తాము అనుకూలంగానే ఉన్నామని ప్రధాని మోదీ చెప్పకనే చెప్పినట్లు అర్ధమవుతోందిని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.