Mamata Banerjee: రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పోటీలో ఉన్న ద్రౌపదీ ముర్మూ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముర్మూకు మద్దతిచ్చే అంశంపై ప్రతిపక్ష పార్టీలు ఒకసారి ఆలోచించాలని ఆమె అన్నారు. ఎన్డీయే అభ్యర్థిగా నిలబెట్టే ముందు బీజేపీ కూడా ప్రతిపక్షాలతో చర్చలు జరిపి ఉంటే బాగుండేదని మమతా అభిప్రాయపడ్డారు. అందరి ఏకాభిప్రాయంతో ఎన్నికయ్యే వ్యక్తి రాష్ట్రపతిగా ఉండడమే దేశానికి మంచిదని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
మహారాష్ట్రలో నెలకొన్న తాజా పరిస్థితులను చూస్తే ద్రౌపదీ ముర్మూ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ముర్మూను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే ముందు బీజేపీ మా సలహాలు అడిగితే బాగుండేదని, అయినా ప్రతిపక్షాల నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని మమతా వ్యాఖ్యానించారు.
ముర్మూకు పెరుగుతున్న మరింత మద్దతు
ఎన్డీయే నుంచి రాష్ట్రపతి అభ్యర్థి ముర్మూకు రోజురోజుకు మద్దతు మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే జేడీయూ, వైసీపీ మద్దతు ప్రకటించగా, తాజాగా పంజాబ్లోని అకాలీదళ్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకే తమ మద్దతు ఉంటుందని అకాలీదళ్ పార్టీ చీఫ్ సుఖ్బీఱ్ సింగ్ బాదల్ మీడియాతో అన్నారు. తాము ఎప్పటికి కాంగ్రెస్తో వెళ్లమని, ఆ పార్టీ సిక్కులపై అనేక అరాచకాలకు పాల్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి