చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 3వ సారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణం చేసి.. నెహ్రూ రికార్డును సమం చేశారు. హ్యాట్రిక్ విజయాలతో NDA కూటమిని అధికారంలోకి తీసుకువచ్చిన మోదీ.. ముచ్చటగా 3వ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తరలి వచ్చిన విదేశీ అతిథులు, వీవీఐపీలు, సెలబ్రిటీలు, వేలాది మంది ప్రజల సమక్షంలో రాష్ట్రపతిభవన్లో కన్నులపండువగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలుత నరేంద్ర మోదీతో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని మోదీ ప్రమాణం అనంతరం ద్రౌపది ముర్ము కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.. ప్రధాని ప్రమాణం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్నాథ్సింగ్, అమిత్షా తో ప్రమాణం చేయించారు.
ఈసారి మోదీ కేబినెట్లో 72 మంది ఉన్నారు. వీరిలో కేబినెట్ ర్యాంక్ 30 మంది ఉంటే, సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) ఐదుగురు, సహాయ మంత్రులుగా 36 మంది ప్రమాణం చేశారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో 43 మందికి 3 సార్లు కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.. 39 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది..
మోదీ 3.0 కేబినెట్ లో భారత్ నలుమూలల నుంచి.. 24 రాష్ట్రాలు.. అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకున్నారు. మొత్తంగా మిత్రపక్షాలకు 11 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.
ఈసారి మోదీ 3.0 కేబినెట్లో మరో విశేషం ఉంది. నలుగురు ముఖ్యమంత్రులు ఈసారి కేంద్ర కేబినెట్లో ఉన్నారు. గతంలో మధ్యప్రదేశ్ CMగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎ మనోహర్లాల్ ఖట్టర్, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, బీహార్ మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ ఇప్పుడు కేంద్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. మోదీ 3.0 కేబినెట్ లో 34 మంది రాష్ట్ర శాసనసభలలో పనిచేసిన వారు, 23 మంది రాష్ట్రాలలో మంత్రులుగా పనిచేసిన వారు సైతం ఉన్నారు.
కేబినెట్ మంత్రుల్లో అగ్రవర్ణాలకు చెందిన వారు 25మంది ఉన్నారు. OBC నుంచి 27, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనార్టీలు 5 మంది కేబినెట్ మంత్రులుగా ఉన్నారు.
కేబినెట్లో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు..? గతంలో ఉన్న మంత్రులకు తిరిగి అవే శాఖలు అప్పగిస్తారా..? ఈసారి బాధ్యతలు మారతాయా అనేది ఉత్కంఠ రేపుతోంది.
ఈ వేడుకకు TDP అధినేత, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సహా మిత్రపక్షాల అగ్రనేతలంతా హాజరయ్యారు. ఈసారి మిత్రపక్షమైన జనసేనకు చోటు కల్పించలేదు. త్వరలోనే విస్తరణలో పదవి ఇచ్చే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..