NAMO 3.O: ఏపీ బీజేపీ నుంచి పురంధేశ్వరికి ఆపి.. శ్రీనివాస వర్మకు చాన్స్ ఇవ్వడానికి కారణాలు ఇవే..
ఉత్తరాదిలో ఇప్పటికే జెండా పాతిన బీజేపీ..మిషన్ సౌత్లో భాగంగా తెలంగాణతో పాటు ఏపీపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూటమి బలంతో మూడు ఎంపీ సీట్లను సాధించిన బీజేపీ..భవిష్యత్తులో సొంతంగా ఎదిగేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. అందులో భాగంగా మంత్రివర్గ కూర్పు నుండి ప్రణాళికలు మొదలు పెట్టింది.
![NAMO 3.O: ఏపీ బీజేపీ నుంచి పురంధేశ్వరికి ఆపి.. శ్రీనివాస వర్మకు చాన్స్ ఇవ్వడానికి కారణాలు ఇవే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/bhupathi-raju-srinivasa-var.jpg?w=1280)
ప్రధానిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేశారు మోదీ. అయితే గతంలో రెండుసార్లు సింగిల్గానే మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ..ఈ సారి మాత్రం ప్రభుత్వం ఏర్పాటుకు భాగస్వామ్య పక్షాలపై ఆధార పడకతప్పలేదు. ఈ క్రమంలో పార్టీ నుండి మంత్రుల ఎంపికలో కీలక వ్యూహాలను అమలు చేశారు..మోదీ. ఏపీలో ఓ వైపు కూటమితో కలిసి ఉంటూనే మరోవైపు సొంతగా ఎదిగేందుకు అవసరమైన చర్యలను చేపట్టారు.
ఏపీలో బీజేపీ తరపున నరసాపురం ఎంపీగా గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర క్యాబినెట్ బెర్త్ లభించింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు..శ్రీనివాస వర్మ. శ్రీనివాస వర్మ దశాబ్దాలుగా బీజేపీకి సేవలందిస్తున్నారు. 1988లో బీజేపీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన శ్రీనివాస వర్మ.. 1992-95లో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు రెండు సార్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్గా గెలుపొందారు. ఇన్ఛార్జి ఛైర్మన్గానూ సేవలందించారు. తాజాగా నరసాపురం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించడంతో మోదీ టీమ్లో అవకాశం లభించింది.
కేంద్ర మంత్రివర్గంలో ఏపీ బీజేపీ నుంచి అందరూ పురంధేశ్వరికి ఛాన్స్ దక్కుతుందని భావించారు. గతంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవంతో పాటు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించడం పురంధేశ్వరికి కలసివస్తుందని అంచనా వేశారు. అయితే ఊహించని విధంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ వర్మ అవకాశం దక్కింది. నిఖార్సైన బీజేపీ నేతగా శ్రీనివాస్వర్మకు పేరుంది. అందుకే పార్టీలో రాష్ట్ర అధ్యక్షురాలి కంటే సామాన్య కార్యకర్తకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్న విషయాన్ని చాటిచెప్పేందుకు వ్యూహత్మకంగా శ్రీనివాస్ వర్మను ఎంపిక చేసినట్టు పార్టీ నేతలు భావిస్తున్నారు. తద్వారా పార్టీ విస్తరణలో కార్యకర్తల భాగస్వామ్యాన్ని మరింత కోరుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఒకేసారి ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలకు అవకాశం ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు మాత్రమే చోటిచ్చి..పురంధేశ్వరిని ప్రస్తుతానికి పక్కన పెట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
మరోవైపు బీజేపీకి ఈ సారి సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎన్డీఏ పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కేంద్రంలో ప్రతిపక్షం గతం కంటే ఈ సారి బలంగా ఉంది. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ పాత్ర కీలకంగా ఉండనుంది. దాంతో రాజకీయంగా అనుభవం ఉన్న పురంధేశ్వరి పేరును.. లోక్సభ స్పీకర్గా పరిశీలిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదే విధంగా బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ సైతం కేంద్రంలో మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు కూడా ప్రస్తుతం నిరాశే ఎదురయింది. రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి రెండు సీట్లలోనూ విజయం సాధించిన జనసేనకు కూడా ఈ సారి అవకాశం లభించలేదు. దీంతో భవిష్యత్తులో రాజకీయంగా చోటు చేసుకొనే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..