
ఈ నెల 2 నుంచి 8 వరకు మావోయిస్టు అమరవీరుల పీఎల్జీఏ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 2000 సంవత్సరంలో డిసెంబరు రెండో తేదీన పీఎల్జీఏ ఏర్పాటైంది. ఈ ఏడాది జరిగిన 22 వ వారోత్సవాలను పురస్కరించుకొని రిక్రూట్మెంట్పై మావోయిస్టు పార్టీ దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్ఘడ్లోని కాంకేర్ జిల్లాలో బంద్కు పిలుపునిచ్చారు. గతనెల 21న వాహనాలు, సెల్టవర్లు, రోడ్డు పనియంత్రాలను దగ్ధం చేశారు. దీంతో ఏపీ,ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.
పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నాకూడ, మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జరిపుకున్న 22వ వారోత్సవాల వీడియోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్- చత్తీస్గడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన వారోత్సవాల్లో వారితో పాటు ఆయా గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను మావోయిస్టులు తాజాగా మీడియాకు రిలీజ్ చేశారు.
గత 22 ఏళ్లుగా మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాలను నిర్వహిస్తోంది. మొదటిసారి 2000 సంవత్సరం మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాలను మొదలు పెట్టారు. అంతకు ముందు ఏడాది కరీంనగర్ జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్ ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రంశెట్టి సంతోష్ రెడ్డి మృతికి వ్యతిరేకంగా పీఎల్జీఏ వారోత్సవాలను మొదలు పెట్టింది.
పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా ఏవోబీ సరిహద్దు గ్రామాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరించి.. ముమ్మర గాలింపు చేపట్టారు. ఎలైట్ గ్రేహౌండ్స్ ఫోర్స్, ఏపీఎస్పీ, సి ఆర్ పి ఎఫ్ అదనపు కంపెనీలు, ఏరియా డామినేషన్ టీమ్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఎక్కడైనా మావోయిస్టులు పేలుడు పదార్థాలు పెట్టారా అని అన్ని చోట్ల తనిఖీలు చేశారు.
ఇక తెలంగాణలోనూ అడవిని జల్లెడ పట్టారు. చతిస్గడ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో విధ్వంసాలకు పాల్పడవచ్చని అనుమానంతో అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ప్రాంతాలలో జరిగే అభివృద్ధి పనులను నిలిపివేసి, యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం