తాళి కట్టేందుకు సిద్ధమైన వరుడు.. ఇంతలో యువకుడి సడెన్ ఎంట్రీ.. అసలు ట్విస్ట్ ఇదే..!
పెళ్లి పేరుతో యువకులను నమ్మించి లక్షల విలువైన నగదు, ఆభరణాలు కాజేస్తున్న ఓ మహిళను మహారాష్ట్రలోని నాగ్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చూపులు, వివాహ ఏర్పాట్ల పేరుతో డబ్బులు వసూలు చేసి, చివరి నిమిషంలో మోసానికి పాల్పడిన ఈ ఘటన సంచలనంగా మారింది. గుజరాత్కు చెందిన ఓ యువకుడి ఫిర్యాదుతో ఈ మోసగత్తె వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పెళ్లి పేరుతో యువకులను నమ్మించి లక్షల విలువైన నగదు, ఆభరణాలు కాజేస్తున్న ఓ మహిళను మహారాష్ట్రలోని నాగ్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చూపులు, వివాహ ఏర్పాట్ల పేరుతో డబ్బులు వసూలు చేసి, చివరి నిమిషంలో మోసానికి పాల్పడిన ఈ ఘటన సంచలనంగా మారింది. గుజరాత్కు చెందిన ఓ యువకుడి ఫిర్యాదుతో ఈ మోసగత్తె వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలోని నాగ్పూర్ సీతాబుల్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాణి అలియాస్ కోమల్ పాండే అనే మహిళ పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువకులను మోసం చేస్తూ డబ్బులు, బంగారం, వెండి ఆభరణాలు కాజేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో యువతిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
గుజరాత్కు చెందిన ఆకాష్ జిందాల్ పరేఖ్ వివాహ సంబంధం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రాణి పాండేతో పరిచయం ఏర్పడింది. ఆమె తనను నమ్రత మాల్వీయ సోదరిగా పరిచయం చేసుకుని, వివాహానికి సంబంధించిన ఫోటోలు చూపించి నమ్మించింది. అనంతరం నాగ్పూర్లోని కోరాడి ప్రాంతంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి నమ్రతను పరిచయం చేసింది.
పెళ్లి ఏర్పాట్లు, ఇతర ఖర్చుల పేరుతో ఆకాష్ నుంచి రూ. 70 వేల నగదు, అలాగే బంగారం, వెండి ఆభరణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సీతాబుల్డిలోని ఓ ఆలయంలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా, అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి నమ్రత తన భార్య అని చెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆకాష్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సీతాబుల్డి పోలీసులు ప్రధాన నిందితురాలు రాణి అలియాస్ కోమల్ పాండేను అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ మోసంలో మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అలాగే గతంలో కూడా రాణి పాండేపై ఇలాంటి మోసపూరిత వివాహ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా మరెంతమందిని ఇదే తరహాలో మోసం చేసిందన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. వివాహ సంబంధాల విషయంలో పూర్తి వివరాలు ధృవీకరించుకుని, అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
