Maharashtra : రేపటి నుంచి మహారాష్ట్రలో సంపూర్ణ లాక్డౌన్.. రాత్రి 8 గంటల నుంచి మే 1 వరకు ఎక్కడికక్కడ బంద్
Maharashtra Lockdown : కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో లాక్డౌన్పై ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది...
Maharashtra Lockdown : కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో లాక్డౌన్పై ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి(గురువారం) నుంచి మహారాష్ట్రలో సంపూర్ణ లాక్డౌన్ విధించారు. రేపు రాత్రి 8 గంటల నుంచి మహారాష్ట్రలో పూర్తి లాక్డౌన్ అమల్లో ఉంటుంది. మే 1 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. లాక్డౌన్పై ఉద్ధవ్ సర్కార్ కొంచెం సేపటి క్రితమే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా మరింత విజృంభిస్తోన్న కారణంగా 144 సెక్షన్ విధించిన ప్రభుత్వం.. మే 1 వరకు కర్ఫ్యూ తరహా నిబంధనలను అమలు పరుస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ కట్టడి విధుల్లో ఉన్న పోలీసులు కూడా మరోమారు వైరస్ బారిన పడుతున్నారు. లాక్ డౌన్ వేళ అత్యవసర సేవలు మినహా అన్ని వర్తక, ఉద్యోగ, వాణిజ్య కార్యకలాపాలు స్థంభింప చేస్తారు. మరోవైపు, కరోనా మహమ్మారి దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇవాళ ఏకంగా ఒక్కరోజులో మూడు లక్షల కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఇప్పటి వరకూ ఒక్కరోజులో ఇంత పెద్దమొత్తంలో కరోనా కేసులు ఇంతకుముందెన్నడూ నమోదు కాలేదు.
ఇలా ఉండగా, గత ఐదు రోజుల నుంచి దేశంలో నిత్యం రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై పలు చర్యలు తీసుకుంటోంది.