AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెరువులో రెండు శవాలు.. పొదల్లో దాక్కున్న 8 ఏళ్ల బాలుడు! ఆ రాత్రి జరిగిన దారుణం ఇదే!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణమైన జంట హత్యల ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య, 11 ఏళ్ల కుమార్తెను హత్య చేసి వారి మృతదేహాలను చెరువులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తన ఎనిమిదేళ్ల కుమారుడిని కూడా నీటిలోకి విసిరేశాడు.

చెరువులో రెండు శవాలు.. పొదల్లో దాక్కున్న 8 ఏళ్ల బాలుడు! ఆ రాత్రి జరిగిన దారుణం ఇదే!
Man Kills Wife, Daughter
Balaraju Goud
|

Updated on: Aug 18, 2026 | 7:41 PM

Share

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణమైన జంట హత్యల ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య, 11 ఏళ్ల కుమార్తెను హత్య చేసి వారి మృతదేహాలను చెరువులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తన ఎనిమిదేళ్ల కుమారుడిని కూడా నీటిలోకి విసిరేశాడు. అయితే బాలుడు పొదలను పట్టుకుని ప్రాణాలతో బయటపడి గ్రామస్తులను అప్రమత్తం చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

కనాడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝలారియా గ్రామంలో సోమవారం (ఆగస్టు 17) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తన తండ్రి తల్లిని, సోదరిని కొట్టి చెరువులోకి విసిరేశాడని బాలుడు పోలీసులకు తెలిపాడు. తనను కూడా నీటిలోకి విసిరేయడంతో మునిగిపోతున్నట్లు నటిస్తూ.. చెరువు ఒడ్డున ఉన్న పొదలను పట్టుకున్నానని చెప్పాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకుని గ్రామానికి చేరుకుని స్థానికులకు సమాచారం ఇచ్చాడు.

బాలుడి సమాచారంతో పోలీసులు, రాష్ట్ర విపత్తు అత్యవసర ప్రతిస్పందన దళం (SDERF) రంగంలోకి దిగాయి. చీకటి కారణంగా గాలింపు చర్యలకు ఆటంకాలు ఎదురైనా.. బృందాలు రాత్రంతా శ్రమించాయి. చివరకు హింగోనియా చెరువు నుంచి రెండు మృతదేహాలను వెలికితీశాయి. మృతులను 32 ఏళ్ల అనిత, ఆమె 11 ఏళ్ల కుమార్తె మాహిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి అనిత భర్త సునీల్ చౌహాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌గా పనిచేసే సునీల్‌ స్వస్థలం దేవాస్‌గా పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

భార్య ఫోన్‌లోని కొన్ని కాంటాక్టులను చూసిన సునీల్.. ఆమె ఇతర వ్యక్తులతో సన్నిహితంగా మాట్లాడుతోందని అనుమానించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం జరిగిన మరో వాగ్వాదం అనంతరం భార్య, పిల్లలను చెరువు వద్దకు తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అక్కడ అనితను చీర కొంగుతో గొంతు నులిమి, కత్తితో పొడిచి చంపాడు. అనంతరం కుమార్తెను నీటిలోకి తోసి, కుమారుడిని కూడా చెరువులోకి విసిరినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన తర్వాత నిందితుడు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసులో ఎనిమిదేళ్ల బాలుడి వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. అతడు ధైర్యంగా గ్రామానికి చేరుకుని సమాచారం ఇవ్వకపోయి ఉంటే ఈ దారుణం మరింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చేదని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన వెనుక అసలు కారణాలు, హత్యలకు ముందు జరిగిన పరిణామాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us