“సార్.. నేను బతికే ఉన్నాను! శవమైందనుకున్న యువతి రాకతో పోలీసులకు ముచ్చెమటలు!

సార్! నేను బతికే ఉన్నాను. నన్ను ఎవరూ హత్య చేయలేదు.. అంటూ 22 రోజులుగా శవంగా ఉన్న ఒక యువతి నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఈ మాటలు చెప్పడంతో, ఖాకీ యూనిఫాంలో ఉన్న వారికి కాళ్ల కింద నేల కదిలిపోయింది. మధ్యప్రదేశ్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఈ ఉదంతం, భారత పోలీసు దర్యాప్తు వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

సార్.. నేను బతికే ఉన్నాను! శవమైందనుకున్న యువతి రాకతో పోలీసులకు ముచ్చెమటలు!
Burhanpur Police Negligence

Updated on: May 28, 2026 | 7:51 AM

సార్! నేను బతికే ఉన్నాను. నన్ను ఎవరూ హత్య చేయలేదు.. అంటూ 22 రోజులుగా శవంగా ఉన్న ఒక యువతి నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఈ మాటలు చెప్పడంతో, ఖాకీ యూనిఫాంలో ఉన్న వారికి కాళ్ల కింద నేల కదిలిపోయింది. మధ్యప్రదేశ్ – మహారాష్ట్ర సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఈ ఉదంతం, భారత పోలీసు దర్యాప్తు వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. హత్య ఆరోపణల కారణంగా గత 22 రోజులుగా జైలులో దుర్భర జీవితం గడుపుతున్న ఒక అమాయక తండ్రి, సోదరుడికి తల్లి అయిన ఆ కుమార్తె, అకస్మాత్తుగా తన భర్తతో కలిసి సజీవంగా తిరిగి వచ్చింది.

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా, ఖడ్కి గ్రామానికి చెందిన శివాని అనే గిరిజన యువతి ఏప్రిల్ 22న అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మే 1న కేసు నమోదైంది. సరిగ్గా ఇదే సమయంలో, మహారాష్ట్రలోని జల్గావ్ జమోద్ ప్రాంతంలో గుర్తుపట్టలేనంతగా కాలిపోయి, తల లేని ఒక యువతి మృతదేహం లభ్యమైంది.

మృతదేహాన్ని గుర్తించేందుకు కనీస డీఎన్ఏ (DNA) పరీక్షలు లేదా శాస్త్రీయ ఆధారాలను సేకరించడంలో మహారాష్ట్ర పోలీసులు విఫలమయ్యారు. కేవలం అదృశ్యమైన రికార్డులను బట్టి, ఆ మృతదేహం శివానిదేనని ప్రాథమికంగా నిర్ధారించారు. అంతటితో ఆగకుండా, శివాని తండ్రి బాపురావు, సోదరుడు అజయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఒత్తిడి లేదా థర్డ్ డిగ్రీ హింస కారణంగా, తామే హత్య చేశామంటూ ఆ తండ్రీకొడుకులు నేరాన్ని అంగీకరించారు. దీంతో వారిని బుల్దానా జైలుకు తరలించారు. గత 22 రోజులుగా వారు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు.

తాను చనిపోయానని పోలీసులు ప్రకటించడం, తన తండ్రి, అన్న జైలుపాలవ్వడం సోషల్ మీడియా ద్వారా శివాని తెలుసుకుంది. తాను ప్రేమించిన అరుణ్ అనే యువకుడితో కలిసి సురక్షితంగా ఉన్నానని చెబుతూ ఆమె బుర్హాన్‌పూర్ పోలీసుల ముందు ప్రత్యక్షమైంది. ఆధార్ కార్డు మరియు బయోమెట్రిక్ వేలిముద్రల ద్వారా ఆమె శివానియేనని పోలీసులు ధృవీకరించారు.

ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. మృతదేహం ఎవరిదో తేల్చకుండానే హత్య కేసు ఎలా నమోదు చేశారు? అసలు శాస్త్రీయ దర్యాప్తు ఎక్కడ? అన్న ప్రశ్న తలెత్తుతోంది. చనిపోని వ్యక్తిని హత్య చేశామని తండ్రీకొడుకులు ఎందుకు ఒప్పుకున్నారు? వారిపై పోలీసులు థర్డ్-డిగ్రీ హింస ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది? అసలు దొరికిన ఆ తల లేని మృతదేహం ఎవరిది? ఆమెను చంపిన అసలు హంతకులు ఎవరు? అనే ప్రశ్నలు అనుమానాలకు తావిస్తున్నాయి.

ఒక యువతి ప్రేమ వివాహం చేసుకుని వెళ్ళిపోతే, పోలీసులు చేసిన తప్పిదం వల్ల ఒక నిరుపేద గిరిజన కుటుంబం పరువు బజారున పడింది. తండ్రీకొడుకులు సామాజికంగా, మానసిక గాయాలకు గురయ్యారు. ఇప్పుడు పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆ అమాయకులకు జరిగిన అన్యాయానికి బాధ్యులు ఎవరు? చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నా, ఇలాంటి గుడ్డి దర్యాప్తు వల్ల సామాన్యులకు వ్యవస్థపై నమ్మకం సడలిపోతోంది. ఆ తండ్రీకొడుకులు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నా, ఆ దొరికిన అజ్ఞాత మృతదేహం మిస్టరీని ఛేదించడం ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us