కరోనాపై నిర్లక్ష్యం తగదు.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
కరోనా వైరస్ వల్ల తలెత్తే ముప్పును మీరు ఎదుర్కొనజాలరని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశ ప్రజలను హెచ్చరించారు. ఈ మహమ్మారి నుంచి తాము క్షేమంగా ఉన్నామని ఎవరూ తప్పుడు అభిప్రాయం..
కరోనా వైరస్ వల్ల తలెత్తే ముప్పును మీరు ఎదుర్కొనజాలరని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశ ప్రజలను హెచ్చరించారు. ఈ మహమ్మారి నుంచి తాము క్షేమంగా ఉన్నామని ఎవరూ తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకోరాదన్నారు. ‘న్యూయార్క్ నగరాన్ని చూడండి.. ఎంతోమంది ధనికులున్న ఆ సిటీ పరిస్థితిని గమనించండి’ అని ఆయన అన్నారు. అయితే ఈ సవాలును తమ ప్రభుత్వం ఎదుర్కోగలదని, సమర్థంగా ఈ సమస్య నుంచి బయటపడగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. లాహోర్ లో కరోనా రోగులకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు ఇమ్రాన్ ఖాన్ అక్కడి ఆసుపత్రిని సందర్శించారు. ఈ ఆసుపత్రిలో వెయ్యి మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. శనివారం నాటికి పాకిస్తాన్ లో 2,818 కరోనా కేసులు నమోదు కాగా.. 41 మంది మరణించారు. ఈ కరోనా ఎప్పుడు విజృంభిస్తుందో, ఎలా నష్టం కలగజేస్తుందో ఎవరికీ తెలియదని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలను రక్షించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందన్నారు.
అటు- దేశవ్యాప్త లాక్ డౌన్ కు అవకాశాలను ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు వంటివాటిని మూసివేసినప్పటికీ.. వ్యవసాయ, నిర్మాణ రంగాలను మినహాయించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇలా ఉండగా ఈ నెలాఖరు నాటికి దేశంలో కరోనా రోగుల సంఖ్య 50 వేలకు చేరుకోవచ్చునని పాక్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన తమ నివేదికలో తెలిపింది.