Karnataka: దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ కేంద్రమంత్రిగా, మాజీ గవర్నర్‌‌గా ఎనలేని సేవలు అందించిన ఎస్‌ఎం కృష్ణ బెంగళూరులో ఈరోజు కన్నుమూశారు. 92 ఏళ్లు వయస్సు ఉన్న ఆయన వృద్ధాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈరోజు ఉదయం మృతిచెందారు.

Karnataka:  దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత
Karnataka Former Cm Sm Krishna Passes Away At 92

Updated on: Dec 10, 2024 | 7:21 AM

కర్ణాటక నాయకుడు, మాజీ విదేశాంగ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో బెంగళూరులోని సదాశివనగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. 92 ఏళ్లు వయస్సు ఉన్న ఆయన వృద్ధాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం తొలుత వైదేహి ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. డా. సత్యనారాయణ మైసూర్, డా. సునీల్ కారంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో వైద్యులు ఆయను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు.

మే 1, 1932న కర్ణాటకలోని మాండ్య జిల్లా మద్దూరు తాలూకా సోమనహళ్లి గ్రామంలో జన్మించిన ఎస్‌ఎం కృష్ణ పూర్తి పేరు సోమనహళ్లి మల్లయ్య కృష్ణ.. ఆయన తన ప్రాథమిక విద్యను హత్తూరులో, సెకండరీ విద్యను మైసూర్‌లోని శ్రీ రామకృష్ణ విద్యాశాలలో, తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ని మైసూర్‌లోని మహారాజా కాలేజీలో, లా డిగ్రీని యూనివర్సిటీ లా కాలేజీలో పూర్తి చేశారు. డల్లాస్, టెక్సాస్, USAలోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ DCలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ లా స్కూల్ నుండి  ఎస్ఎం కృష్ణ పట్టభద్రుడయ్యాడు. 1962లో మద్దూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది ఆయన రాజకీయంలోకి రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘ప్రజా సోషలిస్టు పార్టీలో’ చేరారు. అయితే 1967 ఎన్నికల్లో మద్దూరు నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఎంఎం గౌడ్‌పై ఓడిపోయారు. 1968లో సిట్టింగ్ ఎంపీ మరణించడంతో మాండ్య లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968 ఉప ఎన్నికల తర్వాత మాండ్య నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1971, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. మాండ్యాను కాంగ్రెస్ కంచుకోటగా నిలబెట్టడంలో ఎస్ఎం కృష్ణ పాత్ర కీలకం అని చెప్పవచ్చు.

1999లో కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించారు. ఆ సందర్భంగా ఎస్‌ఎం కృష్ణ చేపట్టిన పాంచజన్య యాత్ర కర్ణాటక ప్రజల్లో కాంగ్రెస్‌కు మంచి ఆదరణ తెచ్చిపెట్టింది. డిసెంబర్ 2004లో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన కృష్ణ 5 మార్చి 2008న మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తర్వాత రాజ్యసభకు ఎన్నికై, 2009 మే 22న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లో బలమైన నాయకుడిగా కొనసాగిన ఎస్‌ఎం కృష్ణ తన రాజకీయ జీవితం ముగిశాక జనవరి 29, 2017న కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. 2017 మార్చిలో అధికారికంగా బీజేపీలో చేరారు. అనారోగ్యం కారణాల వల్ల 7 జనవరి 2023న రాజకీయాల నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. SM కృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మరిన్ని  జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి