AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2027లో స్పేస్‌లోకి భారత వ్యోమగాములు..! మూన్ టార్గెట్‌గా స్పీడు పెంచిన ఇస్రో

భారత్ తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌ను 2027లో చేపట్టేందుకు ఇస్రో వేగంగా సన్నాహాలు చేస్తోంది. నలుగురు భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్న ఈ మిషన్, 2040 నాటికి భారతీయులను చంద్రుడిపైకి పంపాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యానికి కీలక మైలురాయిగా నిలవనుంది.

2027లో స్పేస్‌లోకి భారత వ్యోమగాములు..! మూన్ టార్గెట్‌గా స్పీడు పెంచిన ఇస్రో
Isro
Ch Murali
| Edited By: |

Updated on: Jul 11, 2026 | 2:53 PM

Share

భారత్ అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చంద్రయాన్, ఆదిత్య-ఎల్1 వంటి విజయవంతమైన మిషన్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ఇప్పుడు దేశ తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌పై దృష్టి సారించింది. ఈ మిషన్ విజయవంతమైతే, 2040 నాటికి భారతీయ వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలన్న లక్ష్యానికి బలమైన పునాది పడనుంది.

ఇస్రో ప్రణాళికల ప్రకారం 2027 తొలి త్రైమాసికంలో గగన్‌యాన్ మిషన్‌ను ప్రయోగించే దిశగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తొలుత ఈ మిషన్‌ను 2025లో చేపట్టాలని భావించినప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో షెడ్యూల్‌ను సవరించి 2027కు మార్చారు. ప్రయోగానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గగన్‌యాన్ మిషన్ ద్వారా నలుగురు భారతీయ వ్యోమగాములు భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులోని లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి వెళ్లనున్నారు. అక్కడ సుమారు మూడు రోజుల పాటు వివిధ శాస్త్రీయ ప్రయోగాలు, అంతరిక్ష పరిస్థితులపై అధ్యయనం చేసి తిరిగి భూమిపైకి రానున్నారు. ఈ మిషన్ కోసం ఎంపికైన వ్యోమగాములకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కొనసాగుతోంది.

గగన్‌యాన్ ప్రయోగానికి ముందు భద్రత, సాంకేతిక సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ఇస్రో దశలవారీగా పలు ప్రయోగాత్మక పరీక్షలను నిర్వహిస్తోంది. క్రూ ఎస్కేప్ సిస్టమ్, సర్వీస్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్, రాకెట్ వ్యవస్థలకు సంబంధించిన అనేక పరీక్షలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. మరికొన్ని టెస్ట్ మిషన్ల అనంతరం శ్రీహరికోట నుంచి అసలైన గగన్‌యాన్ ప్రయోగం జరగనుంది. గగన్‌యాన్ విజయవంతమైతే, భారతదేశం మానవ అంతరిక్ష యాత్రలను స్వయంగా నిర్వహించే దేశాల జాబితాలో చేరుతుంది. అనంతరం భారత్ సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు, 2040 నాటికి భారతీయులను చంద్రుడిపైకి పంపే ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను ఇస్రో అమలు చేయనుంది.

చంద్రుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించిన చంద్రయాన్-1, చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన చంద్రయాన్-3 వంటి మిషన్లతో ఇస్రో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ విజయాలే భవిష్యత్ మానవ అంతరిక్ష యాత్రలకు మార్గం సుగమం చేస్తున్నాయి. అంతరిక్ష సాంకేతికతలో భారత్ వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో గగన్‌యాన్ మిషన్ కేవలం మరో ప్రయోగం మాత్రమే కాదు. భారత శాస్త్రవేత్తల సామర్థ్యానికి, దేశ అంతరిక్ష ఆశయాలకు ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక అడుగుగా ఇది భావిస్తున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే, 2040లో చంద్రుడిపై భారతీయ జెండా రెపరెపలాడే రోజు మరింత చేరువ కానుంది.

Follow Us