Corona Vaccine: విదేశాలకు కోవిషీల్డ్ టీకాల ఎగుమతి నిలిపివేసిన భారత ప్రభుత్వం.. కారణం ఏంటంటే..

| Edited By: Ram Naramaneni

Mar 26, 2021 | 10:03 PM

Corona Vaccine: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో

Corona Vaccine: విదేశాలకు కోవిషీల్డ్ టీకాల ఎగుమతి నిలిపివేసిన భారత ప్రభుత్వం.. కారణం ఏంటంటే..
Corona Vaccine
Follow us on

Corona Vaccine: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం కరోనా నివారణ చర్యలకు దిగింది. కోవిడ్‌ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. అదే సమయంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాక్సిన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్‌ నెలాఖరు వరకు ఎగుమతులు ఆగిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశాల మధ్య వ్యాక్సినేషన్‌ పంపిణీ ఎలాంటి ఆటంకం కలుగకుండా కొనసాగించాలని డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే పేర్కొంది. అయినప్పటికీ దేశీయ అవసరాల దృష్ట్యా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఎగుమతులను నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థల్లో పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఒకటి. ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనికా టీకాను కోవిషీల్డ్‌ పేరుతో ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడి నుంచి ఎన్నో దేశాలకు టీకాను పంపిణీ చేస్తోంది భారత ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు దాదాపు 76 దేశాలకు 6 కోట్ల డోసులను భారత్‌ ఎగుమతి చేసింది. ఇందులో అత్యధికంగా కోవిషీల్డ్‌ టీకాలే ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో 60 ఏళ్లపైబడిన వారితో పాటు 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరందుకుంది.

కాగా, మూడో దశ వ్యాక్సినేషన్‌ కోసం కోట్లాది టీకాలు అవసరం అవుతాయి. అందుకే సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన కోవిషీల్డ్‌ టీకాలను ముందు మన దేశ అవసరాలకే వినియోగించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే విదేశాలకు టీకాల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేసింది. మళ్లీ మే నెలలో ఇతర దేశాలకు టీకా ఎగుమతి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా, భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 53,476 కేసులు నమోదు కాగా, 251 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 1,17,87,534 కరోనా కేసులు నమోదు కాగా.. 1,60,692 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. గడిచిన 24గంటల్లో ఈ మహమ్మారి నుంచి 26,490 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 1,12,31,650 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,95,192 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 95.28శాతం ఉండగా.. మరణాల రేటు 1.36శాతం ఉంది. గత 24గంటల్లో దేశవ్యాప్తంతగా 10,65,021 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరు 23,75,03,882 పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5,31,45,709 మందికి టీకా అందించినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.

ఇవీ చదవండి :

దేశంలో కొనసాగుతోన్న కరోనా తీవ్రత.. కొత్తగా 47,262 పాజిటివ్ కేసులు, 275 మరణాలు..

COVID Vaccine: కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్