Coronavirus: మళ్లీ టెన్షన్..టెన్షన్.. …మరోసారి కరోనా పెనుభూతంలా కమ్ముకొస్తోంది
దేశంలో మరోసారి కరోనా రక్కసి కోరలు చాస్తోంది. తొలిమలి, ఆ తరువాతి దశల భీభత్సం కళ్ళముందు కదలాడుతుండగా...మరోసారి కరోనా పెనుభూతంలా కమ్ముకొస్తోంది.
తెలంగాణ సహా….దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. భారత్లో ఒకే ఒక్కరోజులో 2,151 కొత్త కేసులు నమోదవడం జనాన్ని హడలెత్తిస్తోంది. గత ఐదునెలల్లో ఇదే హైయ్యెస్ట్ నంబర్ అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. గత ఏడాది అక్టోబర్ 28న 2,208 కేసులు నమోదవగా…మళ్ళీ ఈ రోజు అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 11,903కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు ఢిల్లీని కోవిడ్ అల్లాడిస్తోంది. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృత్యువాతపడ్డారు. తాజాగా 300 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కోవిడ్ పాజిటివిటీ రేటు13.89 శాతానికి చేరింది. మహారాష్ట్రలో ముగ్గురు, కర్నాటకలో ఒకరు, కేరళలో ముగ్గురు వ్యక్తులను కోవిడ్ మహమ్మారి కబళించింది…వీరంతా మృత్యువాత పడ్డారు.
తెలంగాణలో కోవిడ్ కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలో కొత్తగా 23 కరోనా కేసులునమోదయ్యాయి. హైదరాబాద్లో 6 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కోవిడ్ ప్రకంపనలతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలు… కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. కోవిడ్కి అవసరమైన…మందులు..వైద్యపరికరాలను సమకూర్చుకోవాల్సిందిగా ప్రకటించింది. ఆసుపత్రుల్లో తగినంత మంది వైద్యులు…నర్సులు… ఇతర మానవ వనరులను కూడా సమకూర్చుకోవాలని కేంద్రం సూచించింది.
రెండు రోజుల క్రితం కేంద్రంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కోవిడ్ విజృంభణను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.