రాజస్థాన్..ముచ్చటగా మూడోసారీ ‘నో’ చెప్పిన గవర్నర్ ?
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం కొలిక్కి వచ్ఛేలా కనబడడంలేదు. తన బల నిరూపణకు అసెంబ్లీని సమావేశపరచాలన్న సీఎం అశోక్ గెహ్లాట్ అభ్యర్థనను గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ముచ్చటగా మూడోసారి కూడా తిరస్కరించినట్టు..
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం కొలిక్కి వచ్ఛేలా కనబడడంలేదు. తన బల నిరూపణకు అసెంబ్లీని సమావేశపరచాలన్న సీఎం అశోక్ గెహ్లాట్ అభ్యర్థనను గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ముచ్చటగా మూడోసారి కూడా తిరస్కరించినట్టు తెలుస్తోంది. సభనుసమావేశపరచడానికి తనకు అభ్యంతరం లేదని రెండు రోజుల క్రితమే సుముఖత వ్యక్తం చేసిన ఆయన..మళ్ళీ మనసు మార్చుకున్నారు. అసెంబ్లీని సమావేశపరచాలంటే 21 రోజుల నోటీసు ఇవ్వవవలసి ఉంటుందని కల్ రాజ్ మిశ్రా పాత వ్యాఖ్యనే చేసినట్టు సమాచారం. మూడోసారి గెహ్లాట్ పంపిన ఫైలును ఆయన తిప్పిపంపారు. దీంతో బుధవారం గెహ్లాట్ తిరిగి రాజ్ భవన్ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ … .. ‘ఆయనకు అసలు ఏం కావాలో తెలుసుకుంటా…21 రోజుల నోటీసా లేక 31 రోజుల నోటీసా..అడుగుతా’ అని వ్యాఖ్యానించారు.
ఇంతకు ముందు గవర్నర్..మీరు సభలో ఫ్లోర్ టెస్టు కోరుతున్నారా లేదా అని గెహ్లాట్ ను ప్రశ్నించారు. అయితే రెండో సారి సీఎం సమర్పించిన నోట్ లో… ఈ బల పరీక్ష అంశం లేకుండా రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిమీద, సభలో ఆరు బిల్లులను ప్రవేశపెట్టాలన్న అంశం మీద చర్చకు సభను సమావేశపరచాలని కోరారు. దాంతో గవర్నర్ మళ్ళీ ‘చిరాకు’ పడినట్టు కనిపిస్తోంది.