Jaishankar: ఉగ్రదాడులకు పాల్పడిన వారు.. ఇప్పటికి రక్షణ పొందుతూనే ఉన్నారు.. విదేశాంగ మంత్రి జయశంకర్ ఆవేదన..
ఉగ్రవాదులకు అండగా నిలిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఉగ్రవాద దాడులు జరగకుండా అరికట్టగలమని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ అన్నారు. 2009 నవంబర్ 26వ తేదీన ముంబైలో..
ఉగ్రవాదులకు అండగా నిలిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఉగ్రవాద దాడులు జరగకుండా అరికట్టగలమని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ అన్నారు. 2009 నవంబర్ 26వ తేదీన ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల కుట్రధారులు, పాత్రధారులు ఇప్పటికీ రక్షణ పొందుతూనే ఉన్నారని, నిక్షేపంగా తిరుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఏ శిక్షలూ పడడం లేదన్నారు. నేడు ఉగ్రవాదం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు విస్తరించిందని, దానితో నష్టాల గురించి ఇతరుల కంటే భారత్కే ఎక్కువగా తెలుసని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నూతన సాంకేతికను వాడుకోకుండా నిరోధించడం అనే అంశంపై ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ప్రత్యేక సదస్సులో కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ మాట్లాడారు. ముంబై 26/11 దాడుల మృతులకు గబాన్ దేశ విదేశాంగ మంత్రి, యూఎన్ఎస్సీ అధ్యక్షుడు మైఖేల్ మౌసా–అడామో సహా తదితరులతో కలిసి ఆయన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్.జైశంకర్ మాట్లాడుతూ.. మరో దేశం నుంచి వచ్చిన ముష్కరులు మారణహోమం సృష్టించారని పాకిస్తాన్ తీరుపై ఆయన మండిపడ్డారు. కరడుగట్టిన ఉగ్రవాదుల విషయంలో రాజకీయ కారణాల వల్ల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. పాక్ ఉగ్రవాదులపై ఆంక్షలు విధించకుండా చైనా అడ్డుకుంటోందని విమర్శించారు.
ఉగ్రవాదాన్ని అణచివేయాలంటే ఆ సంస్థలకు నిధులందకుండా చేయాలని సూచించారు. అలా చేస్తే వారి వెన్ను విరిచినట్లేనని సుబ్రమణ్యం జైశంకర్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం ఉమ్మడిగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద దాడుల వల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..