లాకర్లోని రూ.2కోట్లు గోల్డ్, సిల్వర్ మిస్సింగ్.. బ్యాంక్కు వెళ్లిన కస్టమర్కు ఊహించని ట్విస్ట్! ఏం జరిగిందంటే?
ఫరీదాబాద్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో లాకర్ తీసుకున్న ఓ కస్టమర్కు ఊహించని షాక్ తగిలింది. తన లాకర్లో ఉండాల్సిన రూ.2 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మిసయ్యాయి. ఇటీవల కస్టమర్ భార్య బ్యాంక్లోని తన లాకర్ను ఆపరేట్ చేయడానికి వెళ్లగా.. బ్యాంక్లో తమ లాకర్ లేదని అధికారులు చెప్పినట్టు ఆమె ఆరోపించింది. ఆమె వెంటనే విషయాన్ని తన భర్తకు తెలియజేయగా అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చాలా మంది బ్యాంక్ లాకర్లో గోల్డ్ పెడితే సేఫ్గా ఉంటుందని అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన తెలిస్తే మీరు మరోసారి బ్యాంక్ లాకర్ తీసుకోవాలంటేనే భయపడుతారు. ఎందుకంటే ఫరీదాబాద్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లోని లాకర్లో తాను పెట్టిన సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారం, వెండి, విలువైన వస్తువులు అదృశ్యమైనట్లు కస్టమర్ ఆరోపించాడు. వివరాల్లోకి వెళ్తే.. స్టానికంగా చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్న డిసి గార్గ్ అనే వ్యక్తి 2014లో ఫరీదాబాద్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్టార్ 15 మార్కెట్ బ్రాంచ్లో ఓక లాకర్ తీసుకున్నాడు. అందులో సుమారు రూ.2కోట్ల విలువైన, బంగారు, వెండి వస్తువులను ఉంచినట్టు తెలిపాడు. అయితే గత 12 ఏళ్లుగా తన బ్యాంక్ లాకర్ యాక్టీవ్లోనే ఉందని.. ఆయన చెప్పుకొచ్చాడు. అలానే ప్రతి ఏడాది అతని అకౌంట్ను నుంచి ఛార్జెస్ కూడా కట్ అవుతున్నట్టు పేర్కొన్నాడు.
అయితే రెండు రోజుల క్రితం, గార్గ్ భార్య లాకర్ ఆపరేట్ చేయడానికి బ్యాంకుకు వెళ్లినప్పుడు బ్రాంచ్లో తమ లాకర్ లేదని ఆమెకు బ్యాంక్ అధికారులు చెప్పడంతో ఆమె వెంటనే విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న డీసీ గార్గ్ అధికారులను ప్రశ్నించగా, తన పేరు మీద అలాంటి లాకర్ ఏదీ రిజిస్టర్ కాలేదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అసలు లాకర్ కీ తన వద్దే ఉందని గార్గ్ చెప్పగా.. ఆ లాకర్ నంబర్ మరొక వ్యక్తికి కేటాయించబడిందని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.
అయితే గార్గ్ మాత్రం తాను 2014లో లాకర్ తీసుకున్నానని, తన అకౌంట్ నుండి ప్రతి ఏడాది రూ. 2,360 క్రమం తప్పకుండా కట్ అవుతున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం లాకర్ హోల్డర్గా ఉన్న వ్యక్తికి బ్యాంక్ అధికారు తన లాకర్ డూప్లికేట్ కీని ఇచ్చారని ఆయన ఆరోపించారు. అయితే బ్యాంక్ అధికారులు మాత్రం గార్గ్ ముందుగానే లాకర్ను అప్పగించి ఉండవచ్చని చెప్పగా దాన్ని గార్గ్ తిరస్కరించారు.ఒక వేళ తాను లాకర్ను అప్పగించి ఉంటే బ్యాంకు అసలు కీని అధికారులు తిరిగి తీసుకునేవారని, కానీ అది ఇప్పటికీ తన వద్ద ఉందని గార్గ్ పేర్కొన్నాడు.
బ్యాంకు అధికారుల సహకారంతో లాకర్ను పగలగొట్టి, వికాస్ చౌహాన్ అనే వ్యక్తికి లాకర్ను తిరిగి కేటాయించి.. అతనికి ఫేక్ కీని జారీ చేశారని గార్గ్ ఆరోపించారు. లాకర్లో దాదాపు 1.25 కిలోల బంగారు కడ్డీలు, దాదాపు 3 కిలోల వెండి, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని ఆయన చెప్పారు. లాకర్ ఎప్పుడు విరిగిపోయిందో, అందులో ఉన్న విలువైన వస్తువులు ఎప్పుడు తప్పిపోయాయో తనకు తెలియదని గార్గ్ తెలిపారు. ఈ ఘటనపై తాను SBI ఛైర్మన్కు ఫిర్యాదు చేశానని, దీనిపై విచారణ జరుగుతున్నట్టు తెలిపాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
