SIR: ఫేక్ ఓట్లకు చెక్.. ఇవాళ SIR తొలి జాబితా విడుదల.. ముందు ఆ రాష్ట్రాల్లోనే..
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సరిచేయడానికి, దొంగ ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెడుతోంది. ఈ కార్యక్రమం మొదటి దశలో ఏయే రాష్ట్రాలు, ప్రాంతాలు ఉన్నాయో చెప్పే జాబితాను ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని కమిటీ ఢిల్లీలో ప్రకటించనుంది. నవంబర్ 1 నుంచి ఈ కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సరిచేయడానికి, ఫేక్ ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెడుతోంది. అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ ప్రోగ్రామ్కు సంబంధించిన మొదటి దశ జాబితాను ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలతో కూడిన కమిటీ సాయంత్రం 4.15 గంటలకు ఢిల్లీలో ఈ జాబితాను ప్రకటించనుంది. ఈ సమావేశంలో SIR షెడ్యూల్, మొదటి దశలో ఏ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రక్షాళన చేపడతారు అనే విషయాలను ఈసీ వెల్లడించనుంది.
కేరళ మినహాయింపుపై సస్పెన్స్
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున తమ రాష్ట్రాన్ని SIR మొదటి దశ నుండి మినహాయించాలని కేరళ ప్రభుత్వం కమిషన్ను కోరినప్పటికీ.. ఈసీ ఇంతవరకు దానిని ఆమోదించలేదు. అయితే ఈ విషయంలో కమిషన్ నిర్ణయంలో మార్పు ఉంటే, కేరళకు మినహాయింపు లభించే అవకాశం ఉంది. ఈ విషయంపై కమిషన్ అధికారిక ప్రకటనతోనే స్పష్టత రానుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, బెంగాల్లలో మొదటి దశ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
SIR లక్ష్యం ఇదే..
నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా SIR ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో బీహార్లో విజయవంతంగా అమలు చేసిన ఈ ప్రక్రియను ఇప్పుడు దేశమంతా చేపట్టాలని నిర్ణయించారు. ఓటరు జాబితా కంప్యూటరీకరణ జరిగిన గత రెండు దశాబ్దాలుగా గణనీయమైన మార్పులు సంభవించాయని ఈసీ గుర్తించింది. విద్య, ఉద్యోగం వంటి కారణాల వల్ల ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు, కొత్త ప్రదేశంలో ఓటు నమోదు చేసుకుంటారు కానీ, పాత జాబితాలో వారి పేర్లు తొలగించడం లేదు. దీనివల్ల ఒకే వ్యక్తి పేరు రెండు చోట్ల ఓట్లు ఉండే అవకాశం ఉంది. గతంలో బీహార్లో SIR కారణంగా 68.66 లక్షల ఓటర్లను జాబితా నుండి తొలగించారు. ఈ తరహా ప్రక్షాళన దేశవ్యాప్తంగా జరపాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. మూడు రోజుల క్రితంఢిల్లీలో జరిగిన ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశంలో దేశవ్యాప్తంగా SIR సన్నాహాలపై కీలక చర్చలు జరిగాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
