
ఢిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీని మరో మూడు రోజుల పాటు పొడిగించింది న్యాయస్థానం. ఈనెల 16వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉంటారు పిళ్లై. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఇచ్చిన స్టేట్మెంట్ను వెనక్కి తీసుకుంటునట్టు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిళ్లై వేసిన పిటిషన్పై కూడా విచారణ జరిగింది. అయితే పిళ్లై విచారణ అంతా సీసీటీవీలో రికార్డయ్యింది, విచారణ కీలకదశలో ఉన్న సమయంలో ఆయన స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటానని అంటున్నారని ఈడీ కోర్టులో వాదించింది. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు ఈనెల 16వ తేదీ వరకు వాయిదా వేసింది.
మరోవైపు ఆడిటర్ బుచ్చిబాబుకు కూడా కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 15వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నెల 15న చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబుతో కలిపి పిళ్లైని ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏడు రోజుల కస్టడీ పూర్తవడంతో ఈడీ అధికారులు పిళ్లైని కోర్టులో హాజరుపరిచారు. కస్టడీని పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. ఇద్దరి విచారణ అనంతరం 16 వ తేదీన కవితను కూడా ఈడీ విచారించనుంది. మళ్లీ వీరిని కలిపి విచారించనున్నట్లు పేర్కొంటున్నారు.
హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని మార్చి 6 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఢిల్లీ ప్రభుత్వపు ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో సౌత్ గ్రూప్ తరపున పిళ్లై ప్రాతినిధ్యం వహించినట్టు ఈడీ ఆరోపించింది. ఢిల్లీకి చెందిన ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని సమీర్ మహేంద్రూతో పిళ్లైకి సన్నిహిత సంబంధాలున్నాయని ఈడీ చెప్తోంది. అంతే కాదు కల్వకుంట్ల కవితతో కలిసి పనిచేశారనే అభియోగాలు ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..