ఐపీఎస్ అధికారి స్వాతిలక్రాను వదలని సైబర్ కేటుగాళ్లు
సైబర్ నేరగాళ్లు ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసుల ఖాతాలను హ్యాక్ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసుల ఖాతాలను హ్యాక్ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతిలక్రా పేరిట సైబర్ కేటుగాళ్లు పలువుర్ని బోల్తా కొట్టించేందుకు యత్నించారు. నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించి డబ్బులు పంపించాలని మేసేజ్ చేశారు. ఒకటి రెండురోజుల్లో సర్దుబాటు చేస్తానంటూ స్నేహితులు, బంధువులు, పోలీస్ అధికారులకు రిక్వెస్టులు పంపారు. కొందరు అధికారులు సోమవారం ఈ విషయాన్ని స్వాతిలక్రా దృష్టికి తెచ్చారు.
దీంతో వెంటనే ఆమె అప్రమత్తమయ్యారు. తానెవర్నీ డబ్బులు అడగలేదంటూ తన అధికారిక ఖాతాలో వివరణ ఇచ్చారు. సైబర్ క్రైం పోలీసులకు స్వాతిలక్రా ఫిర్యాదు చేశారు. అయితే, అప్పటికే కొన్ని నిమిషాల తర్వాత సైబర్ దొంగలు నకిలీ ఖాతాను తొలగించడం గమనార్హం. ఇప్పటివరకు 50 మంది పోలీస్ అధికారుల పేరిట నకిలీ ఖాతాలను సైబర్ దొంగలు సృష్టించినట్లు సైబరాబాద్ అడిషనల్ డీసీపీ (క్రైమ్స్) కవిత తెలిపారు. ఒడిశా, రాజస్థాన్ కేంద్రంగా ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. స్వాతిలక్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ కవిత తెలిపారు.