MLC Elections: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీ క్లారిటీ.. ఇప్పట్లో ఉండబోవని స్పష్టం

తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ ఇప్పట్లో ఉండబోదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

MLC Elections: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీ క్లారిటీ.. ఇప్పట్లో ఉండబోవని స్పష్టం
Election Commission Of India

Updated on: May 13, 2021 | 4:42 PM

ECI Clarified On AP TS MLC Elections: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతోంది. ఇలాంటి తరుణంలో ఎన్నికలు నిర్వహించడం సముచితం కాదని ఈసీ నిర్ణయించింది. మహమ్మారి పరిస్థితి గణనీయంగా మెరుగుపడే వరకు ఎన్నికలు ఉండవని స్పష్టం చేశారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండలికి ఎన్నికలు నిర్వహించడం లేదని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించింది.

తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు ఈ నెలలో జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఎన్నికలు ఉండవని కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలో తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే నెల జూన్ 3న పూర్తవుతోంది. అలాగే ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మే 31తో పదవి కాలం పూర్తవుతుంది. ఖాళీ అవుతున్న స్థానాలకు ఎలక్షన్స్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అందరూ భావించారు.

సంబంధిత రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం తీసుకున్న తరువాత, అధికారుల నుండి మహమ్మారి పరిస్థితిని అంచనా వేసిన తరువాత కమిషన్ భవిష్యత్తులో తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఈసీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Eci Clarity On Ap Ts Mlc Elections