దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందుల్లో పడ్డాయి. ముఖ్యంగా ప్రధాన ఆదాయంగా ఉన్న లిక్కర్ వ్యాపారం కూడా మ మూసేయడం ప్రధాన కారణం. అయితే ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలతో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయి. అయితే దాదాపు నెలన్నర నుంచి మద్యం లేకపోవడంతో.. మద్యం ప్రియులు షాపులు తెరుస్తున్నారన్న విషయం తెలియడంతో.. తెల్లవారుజామునుంచే దుకాణాల వద్ద క్యూ లైన్లు కట్టారు. కొన్నిచోట్ల కిలో మీటర్ల మేరా లైన్లు ఉండటంతో అది చూసిన వారంతా షాక్కు గురయ్యారు. యథేచ్చగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకుండా మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. అయితే ఈ లైన్లను గమనించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి చెందకుండా ఆన్లైన్ లిక్కర్ సేల్స్కు శ్రీకారం చుడుతున్నాయి. అందులో భాగంగా ఛత్తీస్ఘడ్ ప్రభుత్వం.. తొలుత ఈ ఆన్లైన్ లిక్కర్ సేల్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మద్యం షాపుల వద్ద లైన్లను తగ్గించేందుకు డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఓ ప్రత్యేక మొబైల్ యాప్తో పాటు వెబ్సైట్ను కూడా రూపొందించింది.
అయితే ఈ వెబ్సైట్.. ఛత్తీస్గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీఎస్ఎమ్సీఎల్) ఆధ్యర్యంలో మద్యం అమ్మకాల కోసం అందుబాటులో ఉంచింది. ఈ వెబ్సైట్ ద్వారా.. మద్యం కావాలనుకున్న వారు.. తొలుత మొబైల్ యాప్లో రిజిస్టర్ అవ్వాలి. ఫోన్ నెంబర్, ఆధార్ నంబర్తో పాటు.. పూర్తి సమాచారాన్ని ఎంటర్ చెయ్యాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్కు వచ్చే పాస్వర్డ్తో యాప్లోకి లాగిన్ అయ్యాక.. సమీపంలోని మద్యం దుకాణాలలో కావాల్సిన మద్యాన్ని కొనుక్కోవచ్చు. ఆ తర్వాత డెలివరీ బాయ్ సదరు ఆర్డర్ను ఇంటికి డెలివరీ చేస్తారు. అయితే దీనికి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. కాగా.. డెలివరీ చార్జ్ల కింద రూ.120/- అదనంగా వసూలు చేయనున్నారు. అంతేకాదు.. ఈ ఆన్లైన్ డెలివరీ సమయం ఉదయం 11.00 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు ఈ యాప్ అందుబాటులో ఉంటుందని అని రాష్ట్ర ఎక్సైజ్శాఖ తెలిపింది.