
బెంగళూరు, జూన్ 26: ఓ యువతి తన ప్రియుడితో కలిసి తల్లిదండ్రులు, చెల్లిని కత్తితో పొడిచి హత్య చేసింది. బెంగళూరులోని తూర్పు ప్రాంతమైన సీగేహళ్లిలో కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి గ్రీన్ అపార్ట్మెంట్లో సోమవారం రాత్రి ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులను సోమసుందర్ (55), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), చిన్న కుమార్తె సుప్రియా (20)గా గుర్తించారు. సోమసుందర్ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తుండగా, సుప్రియా డిగ్రీ చదువుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దంపతుల పెద్ద కుమార్తె శ్వేత ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమె తన ప్రియుడు కెన్నెత్తో కలిసి సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్షిప్) చేస్తోంది. ఈ సంబంధాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో కుటుంబంలో తరచూ వివాదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఘటన జరిగిన రోజు సాయంత్రం 7 గంటల సమయంలో సోమసుందర్, ముత్తులక్ష్మి, సుప్రియా ముగ్గురు శ్వేత నివాసానికి వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యుల మధ్య మరోసారి వాగ్వాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో శ్వేత, కెన్నెత్ కలిసి ముగ్గురిపై కత్తులతో దాడి చేసి హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కేఆర్ పురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో వాగ్వాదం జరిగి ఉండొచ్చు. అనంతరం కత్తిపోట్ల ఘటన చోటుచేసుకున్నట్లు భావిస్తున్నాం. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వైట్ఫీల్డ్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైదులు అడవాత్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. బాధితులు అనేక కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తస్రావంతో మృతి చెందినట్లు చెప్పారు. అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన సమయంలో ఎలాంటి గొడవలు లేదా అరుపులు వినిపించలేదని, అయితే సీసీటీవీ ఫుటేజీలో నిందితులు అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు నమోదైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శ్వేత, కెన్నెత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు చేశాక వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.