Bengaluru Potholes: బెంగళూరు రోడ్ల గుంతలపై రగడ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు..

|

Jun 10, 2022 | 9:45 AM

Bengaluru Potholes: బెంగళూర్‌ రోడ్ల గుంతలపై గొడవ మళ్లీ మొదలయ్యింది. ఇప్పటికి రోడ్ల పరిస్థితి మారకపోవడంతో కర్నాటక ప్రభుత్వంపై విమర్శలు..

Bengaluru Potholes: బెంగళూరు రోడ్ల గుంతలపై రగడ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు..
Roads
Follow us on

Bengaluru Potholes: బెంగళూర్‌ రోడ్ల గుంతలపై గొడవ మళ్లీ మొదలయ్యింది. ఇప్పటికి రోడ్ల పరిస్థితి మారకపోవడంతో కర్నాటక ప్రభుత్వంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. వర్షాకాలం కావడంతో రోడ్లపై నరకయాతన అనుభవిస్తున్నారు జనం. ఇలా అయితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు సెలబ్రిటీలు.

భారత సిలికాల్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై సెలబ్రిటీలు మళ్లీ మండిపడుతున్నారు. దావోస్‌ ఆర్థిక సదస్సులో రూ.65వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన ప్రభుత్వం.. ఆ ప్రాజెక్టులకు అవసరమైన సదుపాయాలు కల్పించలేని స్థితిలో ఉందని తప్పుపట్టారు. ఐటీ హబ్‌తో పాటు బెంగళూర్‌ లోని రోడ్లన్నీ పరమదరిద్రంగా తయ్యారయ్యాయని విమర్శిస్తున్నారు. ఇలా అయితే రాష్ట్రానికి అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితమే తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కూడా బెంగళూరులోని ఐటీ సంస్థలు అక్కడి సదుపాయాలతో విసుగెత్తిపోతే హైదరాబాద్‌కు రావాలని ట్వీట్‌ చేశారు. బెంగళూరుకు చెందిన బీఎన్‌ శ్రీరామ్‌ బెంగళూరు- మైసూరు రహదారిపై గుంతలను వీడియో తీసి ట్వీట్‌ చేశారు. ‘‘భారతీయ ఐటీ కేంద్రానికి స్వాగతం. ఈ గుంతల్లో వాహనదారులు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూడాల్సిందే’’ అంటూ వ్యాఖ్యానించారు.

బీఎస్‌ శ్రీరామ్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన బయోకాన్‌ ఎండీ కిరణ్‌ మజుందార్‌ షా ఇది దిగ్భ్రాంతికరం, అవమానకరం అన్నారు. ఇటీవలే కిరణ్‌ మజుందార్‌ షా తన ట్వీట్‌లో బెంగళూరు రహదారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రహదారులు వేయలేనివారు బస్టాండులు ఎందుకు కట్టించారంటూ ప్రశ్నించారు.

కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.ఎం.కృష్ణ ఇక్కడి రహదారుల దుస్థితిపై ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి లేఖ రాశారు. నగరంలోని మౌలిక సదుపాయాలను చూస్తుంటే ‘బ్రాండ్‌ బెంగళూరు’ కీర్తికి మచ్చ తేవటం ఖాయమని హెచ్చరించారు. ఇన్ఫోసిస్‌ మాజీ డైరెక్టర్‌ మోహన్‌దాస్‌ పాయ్‌ కూడా హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నట్లు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బుధవారం స్పందించిన రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి.. రానున్న నవంబరులోగా బెంగళూరులో అన్ని రహదారులనూ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.