
మొబైల్ ఫోన్లో మ్యూజిక్ వాల్యూమ్ విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. దంపతుల మధ్య వాగ్వాదం నేపథ్యంలో సహనం కోల్పోయిన భర్త తన భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మే 19న ఉత్తర బెంగళూరులోని సిదేదహళ్లిలోని NMH లేఅవుట్లో జరిగింది. ఆ మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటోందని, ప్రమాదం నుండి బయటపడిందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
బెంగళూరులోని సిద్దేదహల్లిలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సిద్దేదహల్లికి చెందిన ఓ మహిళ స్థానికంగా బ్యూటీషియన్గా పనిచేస్తోంది. అయితే, ఆమె భర్త మద్యానికి బానిసగా మారాడు. తాగుడుకు డబ్బు కావాలని తరచూ భార్యను వేధించేవాడు..ఈ క్రమంలోనే మద్యానికి డబ్బులు కావాలని భర్త కోరగా.. మొదట నిరాకరించినా తర్వాత ఇచ్చింది. దాంతో అతడు ఫుల్గా తాగి ఫోన్లో పాటలు వింటున్నాడు. అది కూడా సౌండ్ ఎక్కువగా పెట్టుకుని వింటున్నాడు.. దాంతో ఆమె సౌండ్ తగ్గించమని కోరింది.
సెల్ఫోన్లో సౌండ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో విచక్షణ కోల్పోయిన అతడు బాత్రూంలో ఉన్న యాసిడ్ తెచ్చి ఆమెపై పోశాడు. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కేకలు విన్న పొరుగువారు ఆమెకు సహాయం చేసి ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత మహిళ ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..