అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఖర్చు ఎంతో తెలుసా..? అంచనాలను వెల్లడించిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్
అయోధ్యలో రామాలయం నిర్మాణ ఖర్చు అంచనా విడుదలైంది. అంచనా వివరాలను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. అయోధ్య రామాలయ నిర్మాణానికి రూ.1,100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది...

అయోధ్యలో రామాలయం నిర్మాణ ఖర్చు అంచనా విడుదలైంది. అంచనా వివరాలను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. అయోధ్య రామాలయ నిర్మాణానికి రూ.1,100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయోధ్య ప్రధాన ఆలయానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపింది. అయోధ్యలో రామాలయాన్ని మూడున్నరేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. నిపుణుల సారథ్యంలో ఆలయ ఆకృతులు రూపకల్పన జరుగుతుందన్నారు.
అయితే రామాలయ రూపకల్పనలో ఐఐటీలు, ఇతర సంస్థల సాయం చేయనున్నాయని, ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా రూ.100 కోట్లకుపైగా విరాళాలు అందాయని వెల్లడించారు. అలాగే దాదాపు 4 లక్షల గ్రామాల్లో 11 కోట్ల కుటుంబాల దగ్గరకు వెళ్తామని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కేవలం స్వదేశీ నిధులతోనే రామ మందిరం నిర్మాణం జరుగుతుందని శ్రీరామ ట్రస్ట్ ఇప్పటికే స్పష్టం చేసింది. భారీ ప్రచార కార్యక్రమం ద్వారా వీటిని సాధారణ పౌరుల నుంచి మాత్రమే సేకరిస్తామని, ఇందు కోసం రూ.10, రూ.100, రూ.1000 విలువగల కూపన్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది.




