
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఆ నీచుడిని కని పెంచడమే ఓ తల్లి చేసిన మహా పాపమైంది. ఒంటి పైకి 40 ఏళ్లు వచ్చినా ఇంకా తల్లి మీదనే ఆధారపడటం మాత్రమే కాకుండా డ్రగ్స్కు కూడా విపరీతంగా బానిసయ్యాడు. దీంతో నిత్యం డబ్బు కోసం తల్లిని వేదించసాగాడు. ఈ క్రమంలో డ్రగ్స్ కొనేందుకు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో మాదక ద్రవ్యాల మత్తుల్లో ఆ నీచుడు వృద్ధురాలైన కన్న తల్లిపైకే కత్తి దూసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన ఈశాన్య ఢిల్లీలోని దయాల్పూర్ ప్రాంతంలో శనివారం (ఫిబ్రవరి 15) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఘటన ఈశాన్య ఢిల్లీలోని దయాల్పూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సోనూ అనే వ్యక్తికి 40 ఏళ్లు. 65 ఏళ్ల తల్లితో ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన సోను ప్రస్తుతం నిరుద్యోగి. మాదకద్రవ్యాలకు బానిసై డబ్బు కోసం నిత్యం తల్లిని చిత్ర హింసలకు గురి చేసేవాడు. దీంతో అతడు డబ్బు కోసం తన తల్లితో తరచుగా గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో దయాల్పూర్ పోలీస్ స్టేషన్కు ఓ కాల్ వచ్చింది. పోలీసులు బృందం సంఘటన స్థలానికి చేరుకుని చూడగా అక్కడ రక్తపు మడుగులో వృద్ధ మహిళ మృతి చెంది కనిపించింది. దర్యాప్తులో ఆమె సోనూ తల్లిగా తేలింది. దీంతో పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది.
శుక్రవారం రాత్రి డబ్బు కోసం సోనూ తల్లితో గొడవపడ్డాడు. దీంతో వారి మధ్య మరోమారు వాగ్వాదం చోటు చేసుకుంది. డబ్బు ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో ఆగ్రహావేశాలకు గురైన సోను తన తల్లిని హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం జీటబీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్కు అలవాటు పడిన సోనూ డబ్బు విషయంలో జరిగిన వాగ్వాదంలో తల్లిని హత్య చేశాడని వారు మీడియాకు తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.